లండన్లో మరోసారి లాక్డౌన్.. వేగంగా విస్తరిస్తున్న స్ట్రెయిన్ వైరస్.. ఆ దేశం నుంచి రాకపోకలు బంద్…
యూకేలో కొత్తరకం కరోనా వైరస్ స్ట్రెయిన్ తీవ్రంగా విజృంభిస్తోంది. దీంతో పలు దేశాలు విమాన రాకపోకలపై నిషేధం విధించాయి. నేటి నుంచి
యూకేలో కొత్తరకం కరోనా వైరస్ స్ట్రెయిన్ తీవ్రంగా విజృంభిస్తోంది. దీంతో పలు దేశాలు విమాన రాకపోకలపై నిషేధం విధించాయి. నేటి నుంచి 48 గంటల పాటు నెదర్లాండ్, ఆస్ట్రియా, బెల్జియం, ఇజ్రాయెల్, జర్మనీ, దక్షిణాఫ్రికా విమాన రాకపోకలపై నిషేధం విధించాయి. బ్రిటన్తో ఉన్న రైలు మార్గాన్ని కూడా బెల్జియం నిలిపివేసింది. అంతేకాకుండా క్రిస్మస్ వేడుకలను నిషేధిస్తూ లాక్డౌన్ విధించింది. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.
లండన్లో అక్కడి ప్రభుత్వం మరోసారి లాక్డౌన్ అమలు చేస్తోంది. ఈ రకం వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. ఇది మరింత ప్రాణాంతకమైన వైరస్ అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే తీవ్ర అనారోగ్యానికి కారణమని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. బ్రిటిష్ ఆరోగ్య కార్యదర్శి మాట్ హెన్కాక్ మాట్లాడుతూ.. దురదృష్టవశాత్తూ కొత్త రకం స్ట్రెయిన్పై నియంత్రణ కోల్పోయాం అందుకే దక్షిణ బ్రిటన్లో క్రిస్మస్ వేడుకలపై కఠినంగా నిషేధాజ్ఞలు విధిస్తున్నాం అన్నారు. ప్రజలు స్ట్రెయిన్ వైరస్పై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇదిలా ఉంటే కరోనా వైరస్ కొత్త రూపం వ్యాప్తిపై యూకే ప్రభుత్వంతో కలిసి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కొత్త వైరస్ జాడలు సెప్టెంబర్లోనే కనిపించాయని వెల్లడించింది. ఇది వైరస్ కొత్త రూపమా? కాదా? ఎంత వేగంగా వ్యాప్తి చెందుతోంది? అనే విషయాలపై లోతుగా అధ్యయనం జరుపుతున్నట్లు డబ్ల్యూహెచ్వో అధికారి మరియా వాన్ కెర్ఖోవ్ తెలిపారు. ఇలాంటి వైరస్ను ఇప్పటికే డెన్మార్క్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియాలో గుర్తించామన్నారు.