India competing America: ‘ఆ’ విషయంలో అమెరికాతో పోటీ పడుతున్న భారత్.. అక్కడ 69 అయితే.. ఇండియాలో 40 మంది.. వాహ్ హిందుస్థాన్!
భారత్ అమెరికాతో పోటీ పడుతోంది. ఎన్నో రంగాల్లో అమెరికాతో పోలిస్తే భారత్ ఎక్కడో దూరంలో నిలుస్తుంది. కానీ కొన్నింటిలో మాత్రం ఇండియా అమెరికాతో పోటీ పడుతోంది. ఎస్.. కరోనా నియంత్రణలోను అమెరికా..
India competing America in richest persons list: భారత్ అమెరికాతో పోటీ పడుతోంది. ఎన్నో రంగాల్లో అమెరికాతో పోలిస్తే భారత్ ఎక్కడో దూరంలో నిలుస్తుంది. కానీ కొన్నింటిలో మాత్రం ఇండియా అమెరికాతో పోటీ పడుతోంది. ఎస్.. కరోనా నియంత్రణలోను అమెరికా కంటే ఎంతో మెరుగ్గా పని చేసిన ఇండియా తాజాగా మరో జాబితాలో అమెరికాకు ధీటుగా నిలిచింది. హరున్ గ్లోబల్ రిచ్ లిస్టులో ఓ అంశంలో భారత్ అగ్ర రాజ్యం అమెరికాతో పోటీ పడింది. సంపన్నుల సంఖ్యలో భారత్ ఏ మాత్రం తీసిపోదని హరున్ గ్లోబల్ రిచ్ లిస్టు నిరూపించింది.
హరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం ఇండియాలో మొత్తం 209 మంది బిలియనీర్లు (ఒక బిలియన్ వంద కోట్లతో సమానం) ఉన్నారు. వీరిలో 177 మంది ప్రస్తుతం మనదేశంలో నివసిస్తున్నారు. మిగిలిన వారు విదేశీలలో తమ వ్యాపార, వాణిజ్యాలను నెలకొల్పి రాణిస్తున్నారు. వేల కోట్లను ఆర్జిస్తున్నారు. గత సంవత్సర కాలం (2020 కరోనా నామ సంవత్సరం)లో కొత్తగా పుట్టుకొచ్చిన బిలియనీర్ల విషయంలో అగ్రరాజ్యం అమెరికాతో భారత్ పోటీ పడింది. అమెరికాలో మొత్తం 69 మంది కొత్తగా బిలియనీర్ల జాబితాలో చేరగా.. ఇండియా నుంచి ఆ జాబితాలో చేరిన వారి సంఖ్య 40గా తేలింది. ఐటీ సేవల కంపెనీ స్కేలార్ సీఈవో జే.చౌదరి సంపద 271 శాతం పెరిగి 96,000 కోట్ల రూపాయలకు చేరింది. అలాగే అదానీ గ్రూప్నకు చెందిన వినోద్ శాంతిలాల్ అదానీ సంపద 128 శాతం పెరిగి 72,000 కోట్ల రూపాయలకు ఎగబాకింది.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల ‘హరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021’ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఎనిమిదో స్థానంలో నిలిచారు. గత సంవత్సర కాలంలో ఆయన సంపద 24 శాతం పెరిగింది. ప్రస్తుతం ముఖేశ్ అంబానీ ఆస్తుల విలువ 83 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.6.09 లక్షల కోట్లకు చేరింది. ఇక ఈ జాబితాలో రూ. 2.34 లక్షల కోట్ల సంపదతో గౌతమ్ అదానీ అండ్ ఫ్యామిలీ 48వ ర్యాంకు, రూ.1.94 లక్షల కోట్లతో శివ్ నాడార్ అండ్ ఫ్యామిలీ 58వ ర్యాంకు, రూ.1.40 లక్షల కోట్లతో లక్ష్మీ నివాస్ మిట్టల్ 104వ ర్యాంకు, రూ. 1.35 లక్షల కోట్ల సంపదతో సీరం ఇన్స్టిట్యూట్ అధిపతి సైరస్ పూనావాలా 113వ ర్యాంకులో నిలిచారు.
మళ్ళీ అగ్రస్థానానికి ఎలన్ మస్క్
‘హరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్’ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సంపన్నునిగా టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ నిలిచారు. గత ఏడాది కాలంలో ఆయన సంపద 328 శాతం పెరిగి 197 బిలియన్ డాలర్లకు చేరింది. ఒక్క సంవత్సర కాలంలో ఆయన సంపద ఏకంగా 151 బిలియన్ డాలర్లు ఎగబాకింది. ఇక అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ 189 బిలియన్ డాలర్లు, ఫ్రాన్స్కు చెందిన లగ్జరీ వస్తువుల తయారీ కంపెనీ ఎల్వీఎంహెచ్ ఛైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ 114 బిలియన్ డాలర్లు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్గేట్స్ 110 బిలియన్ డాలర్లు, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ 101 బిలియన్ డాలర్లతో వరుసగా మొదటి ఐదు స్థానాల్లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏడాది వ్యవధిలో 50 బిలియన్ డాలర్లకు పైగా సంపద ఆర్జించిన వారు కేవలం ముగ్గురే ముగ్గురు కావడం విశేషం. వీరిలో ఒకరు ఎలన్ మస్క్(151 బిలియన్ డాలర్లు) కాగా.. జెఫ్ బెజోస్(50 బిలియన్ డాలర్లు), పిన్డ్యువోడ్యువో అధినేత కొలిన్ హువాంగ్(50 బిలియన్ డాలర్లు) ఉన్నారు. ఇక ఈ జాబితాలో చోటు దక్కిన వారిలో సంవత్సర కాలంలో 161 మంది ఐదు బిలియన్ డాలర్లకు పైగా సంపాదించారు. వీరిలో 84 మంది చైనీయులు, 38 మంది అమెరికన్లు, ఐదుగురు భారతీయులు ఉన్నారు.
ALSO READ: ప్రపంచంపై డ్రాగన్ కుట్ర.. పరిశ్రమలే లక్ష్యంగా యూనిట్ 61398.. మెయిన్ ఫోకస్ ఇండియా
ALSO READ: తెలంగాణలో కరోనాకు ఏడాది.. సంవత్సరంలో ఎన్ని మార్పులు.. ఎంత నష్టం! గుణపాఠం నేర్పిందా?
ALSO READ: ఓవైపు కరోనా..ఇంకోవైపు ఎండలు.. అకాడమిక్ ఇయర్ రద్దేనా?
ALSO READ: హడలెత్తిస్తున్న మొసళ్ళు.. ఇటీవల కాలంలో ఎన్నో దాడులు.. ఎలా దాడులకు దిగాయో తెలిస్తే షాకే!
ALSO READ: ఈసారి మాడు పగలడం ఖాయం.. దంచికొట్టనున్న ఎండలు