Imran Khan: ప్రధాని మోదీపై ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు.. నవాజ్ షరీఫ్తో పోల్చుతూ ఆసక్తికర వ్యాఖ్యలు
గతంలోనూ భారత్పై పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించారు. భారత విదేశాంగ విధానం భేష్ అంటూ అభినందించారు.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) మరోసారి భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi)పై ప్రశంసల జల్లు కురిపించారు. పాక్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ ముస్లీం లీగ్ (N) చీఫ్ నవాజ్ షరీఫ్, భారత ప్రధాని నరేంద్ర మోదీల ఆస్తులను పోల్చుతూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో నవాజ్ షరీఫ్ భారీ ఎత్తున ఆస్తులను కూడబెట్టుకున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు. నవాజ్ షరీఫ్ అవినీతిపరుడని ధ్వజమెత్తారు. నవాజ్ షరీఫ్కు ఉన్నన్ని ఆస్తులు ప్రపంచంలో మరో నేతకు లేవన్నారు. నవాజ్ షరీఫ్లా భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశాల్లో ఆస్తులు కూడబెట్టుకోలేదన్నారు. ఆ మేరకు నవాజ్ షరీఫ్పై ఇమ్రాన్ ఖాన్ తీవ్రస్థాయిలో విరుచుకపడుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
‘ఒక దేశాధినేతకు మరో దేశంలో కోట్లాది రూపాయల ఆస్తులు ఎవరికి ఉన్నాయో చెప్పండి చూద్దాం.. పొరుగు దేశంలో ప్రధాని నరేంద్ర మోదీకి బయటి దేశంలో ఎన్ని ఆస్తులు ఉన్నాయి?’ అంటూ ఇమ్రాన్ ఖాన్ ప్రశ్నించారు. నవాజ్ షరీఫ్కు విదేశాల్లో ఎన్ని ఆస్తులు ఉన్నాయో ఎవరూ ఊహించలేరని అభిప్రాయపడ్డారు.
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గతంలోనూ భారత విదేశాంగ విధానాన్ని కొనియాడుతూ వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి రాయితీపై భారత్ ఆయిల్ కొనుగోలు చేసిందని, దీని ద్వారా ఆ దేశ ప్రజలకు ప్రయోజనం చేకూరిందన్నారు. అయితే ప్రస్తుత పాక్ ప్రభుత్వం (పీఎంఎల్-ఎన్)కు తలలో మెదడు లేని ఆర్థిక విధానాలతో పాలన చేస్తోందంటూ విమర్శలు గుప్పించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదవండి..