మీకు సాయం చేస్తాం, ఇండియాకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అభయహస్తం
కోవిడ్ కేసులతో తల్లడిల్లుతున్న ఇండియా కోరితే తాము సాయం చేస్తామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. భారత ప్రభుత్వానికి, ప్రజలకు ఎలాంటి సహాయం అవసరమో యోచిస్తున్నామని...
కోవిడ్ కేసులతో తల్లడిల్లుతున్న ఇండియా కోరితే తాము సాయం చేస్తామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. భారత ప్రభుత్వానికి, ప్రజలకు ఎలాంటి సహాయం అవసరమో యోచిస్తున్నామని ఆయన చెప్పారు. బహుశా బ్రిటన్ నుంచి వెంటిలేటర్లు, థెరాపెటిక్స్ రూపంలో ఈ సాయం ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇండియాను యూకే రెడ్ లిస్టులో చేర్చింది. పైగా తన భారత పర్యటనను బోరిస్ జాన్సన్ రద్దు చేసుకున్నారు. ఇండియా నుంచి వచ్చిన కొందరు విమాన ప్రయాణికుల్లో 55 కేసుల డబుల్ మ్యుటెంట్ ఇండియన్ వేరియంట్ ని పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ ధృవీకరించింది. దీంతో బ్రిటన్ ప్రభుత్వం బెంబేలెత్తింది. ఇప్పటికే తమ దేశంలో ఇలాంటి కేసులు చాలా ఉన్నాయని, ఇప్పుడు భారత్ నుంచి కూడా ఇవి తమ దేశంలో ప్రవేశిస్తే మరింత రిస్క్ అవుతుందని ప్రభుత్వం భావించింది. ఇంకా హానికరమైన మ్యుటెంట్ కేసులు ఏవైనా ఉన్నాయా అని నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. మొత్తం 40 దేశాలను యూకే రెడ్ లిస్టులో పెట్టింది. ఆ దేశాల సరసన ఇండియా కూడా చేరింది. ఇండియా నుంచి వచ్చే ఏ ప్రయాణికుడైనా 10 రోజులపాటు క్వారంటైన్ లో ఉండడమే కాక. అన్ని కోవిడ్ టెస్టులను జరిపించుకోవాల్సి ఉంటుంది. పైగా ఈ ఖర్చులకు 2 వేల పౌండ్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త ఆంక్షలను శుక్రవారం నుంచి అమలు చేస్తున్నారు.
భారత్ నుంచి వచ్చే అదనపు విమానాలను అనుమతించరాదని లండన్ లోని హీత్రో విమానాశ్రయ అధికారులు తాజాగా నిర్ణయించారు. కనీసం 8 విమానాలనైనా అనుమతించాలన్న భారత అభ్యర్థనను వారు తిరస్కరించారు. ఇండియా నుంచి చివరి విమానం గురువారం ఈ విమానాశ్రయం చేరింది. ఇకపై భారత్ లో సాధారణ పరిస్థితుల పునరుధ్దరణ జరిగేంతవరకు ఈ బ్యాన్ కొన్ని నెలల పాటు ఉండవచ్చునని భావిస్తున్నారు.