Israel Air Strike on Gaza: గాజాపై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్.. మిలిటెంట్ స్థావరాలే టార్గెట్.. 10 మంది మృతి..
దేశంలో 'స్పెషల్ ఎమర్సెన్సీ' ప్రకటించింది ఇజ్రాయెల్. ఇక్కడ సరిహద్దు నుండి 80 కి.మీ పరిధిలో ఉన్న అన్ని పాఠశాలలు మూసివేశారు.
ఇజ్రాయెల్ శుక్రవారం గాజాపై వైమానిక దాడులను మొదలు పెట్టింది. పాలస్తీనా మిలిటెంట్ స్థావరాలను టార్గెట్ చేసింది. వరుస దాడులతో బీభత్సం సృష్టించింది. ఇజ్రాయెల్ జరిపిన ఎయిర్ స్ట్రైక్లో హమాస్ మిలిటెంట్ గ్రూప్ సీనియర్ కమాండర్తో సహా కనీసం 10 మంది మరణించినట్లుగా పాలస్తీనా అధికారులు వెల్లడించారు. ఈ వారం ప్రారంభంలో ఒక సీనియర్ పాలస్తీనా తిరుగుబాటుదారుని అరెస్టు చేసిన తరువాత ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో గాజాపై దాడి ఇజ్రాయెల్ దాడులు మొదలు పెట్టింది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం జరుపుతున్న దాడులకు.. పాలస్తీనా మిలిటెంట్లు కూడా ప్రతి దాడులకు దిగే అవకాశం ఉంది.
దీంతో ఇజ్రాయెల్ కూడా దేశంలో ‘స్పెషల్ ఎమర్జెన్సీ’ని ప్రకటించింది. ఇక్కడ సరిహద్దు నుంచి 80 కి.మీ పరిధిలో ఉన్న అన్ని పాఠశాలలు మూసివేశారు. అక్కడి ప్రజలకు ఇతర కార్యకలాపాలు నిలిపివేశారు. ఇజ్రాయెల్ ఈ వారం ప్రారంభంలో గాజా చుట్టూ రహదారులను మూసివేసింది. సరిహద్దుకు అదనపు దళాలను తరలించింది. సోమవారం (ఆగస్టు 1) ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో సీనియర్ హమాస్ సభ్యుడిని అరెస్టు చేసిన తర్వాత ఈ దాడులకు ప్లాన్ చేసింది ఇజ్రాయెల్.
ఇజ్రాయెల్, పాలస్తీనా హమాస్ మధ్య గత 15 సంవత్సరాలుగా వివాదం కొనసాగుతోంది. 15 సంవత్సరాలలో నాలుగు యుద్ధాలు, అనేక చిన్న చిన్న వాగ్వివాదాలు జరిగాయి. ఇటీవలి కాలంలో అత్యంత భయంకరమైన యుద్ధం మే 2021న జరిగింది.
ఇదిలావుంటే తాము కూడా దాడులు మొదలు పెడుతామని ప్రకటించుకున్నారు హమాస్ ప్రతినిధి ఫౌజీ బర్హోమ్ . ఈ దురాక్రమణకు వ్యతిరేకంగా పాలస్తీనా ప్రతిఘటన కోసం ఐక్యంగా నిలబడాల్సిన సమయం అంటూ పాలస్తీనావాసులకు గుర్తు చేశాడు. ఇరాన్లో ఉంటున్న పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ ప్రతినిధి అల్-మైడిన్ టీవీ నెట్వర్క్తో ఈ వివరాలను వెల్లడించాడు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం