మాజీ రాయబారి కూతురి దారుణ హత్యకు నిరసనగా పాకిస్తాన్ లో భారీ నిరసన ప్రదర్శనలు
పాకిస్తాన్ లో మాజీ రాయబారి షౌకత్ ముకద్ధం కూతురు నూర్ ముకద్ధం దారుణ హత్యకు నిరసనగా ఇస్లామాబాద్ లో ఆదివారం భారీ నిరసన ప్రదర్శనలను నిర్వహించారు.
పాకిస్తాన్ లో మాజీ రాయబారి షౌకత్ ముకద్ధం కూతురు నూర్ ముకద్ధం దారుణ హత్యకు నిరసనగా ఇస్లామాబాద్ లో ఆదివారం భారీ నిరసన ప్రదర్శనలను నిర్వహించారు.దేశంలో మహిళలపై నేరాలు. అఘాయిత్యాలు, హింస పెరిగిపోయాయంటూ వేలాది మంది సోషల్ మీడియాలో కూడా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. నూర్ ను ఈ నెల 20 న జాహిర్ జాఫర్ అనే వ్యక్తి కాల్చి చంపాడు. అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ మరుసటి రోజే మరో మహిళ కూడా మర్డర్ కి గురైందని, దేశంలో ఇలాంటి అమానుషాలు ఇంకెంత కాలం కొనసాగుతాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నూర్ మర్డర్ నగరంలో యువతులపై హింస పెరిగిపోతోందనడానికి నిదర్శనమని పాక్ మానవ హక్కుల శాఖ మంత్రి షిరీన్ మజారీ పేర్కొన్నారు. ఇది అంతం కావాలని, నేరస్థులు రాజకీయ పలుకుబడి కలవారైనా తప్పించుకోరాదని ఆమె అన్నారు. జాహిర్ జాఫర్ తలిదండ్రులను, ఇంటిలోని వారిని పోలీసులు ఈ నెల 24 న అరెస్టు చేశారు. నూర్ హత్యకు సంబంధించి సాక్ష్యాధారాలను మాయం చేయడానికి వారు ప్రయత్నించారని వారు ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు.
నూర్ తండ్రి షౌకత్ లోగడ సౌత్ కొరియా, తజకిస్థాన్ దేశాలకు పాక్ రాయబారిగా వ్యవహరించారు. కొన్ని రోజుల క్రితం పాక్ లో ఆఫ్ఘన్ రాయబారి కూతురు సిల్ సిలా అలిఖిల్ ని కూడా దుండగులు కిడ్నాప్ చేసి.. టార్చర్ కి గురి చేసిన విషయం తెలిసిందే. ఆమె ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆ కేసులో ఇద్దరు టాక్సీ డ్రైవర్లను అరెస్టు చేసినట్టు మాత్రం పాక్ ప్రభుత్వం తెలిపింది. అసలైన దుండగులు ఇంకా పరారీలో ఉన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Smart Phone usage: తల్లిదండ్రులకు షాకింగ్ న్యూస్.. స్మార్ట్ఫోన్తో మీ పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా?