Sudan violence: ఫ సూడాన్లో రెండు వర్గాల ఘర్షణ.. గిరిజన హింసలో 168 మంది మృత్యువాత!
సూడాన్ దేశంలో రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ రక్తసిక్తంగా మారింది. అంతర్గత యుద్ధంతో అతలాకుతలమైన డార్ఫర్ ప్రాంతంలో జరిగిన ఆదివాసీల ఘర్షణలో ఆదివారం 168 మంది మరణించారని సూడాన్ సహాయక బృందం తెలిపింది.
Sudan Tribes Violence: సూడాన్ దేశంలో రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ రక్తసిక్తంగా మారింది. అంతర్గత యుద్ధంతో అతలాకుతలమైన డార్ఫర్ ప్రాంతంలో అరబ్బులు, అరబ్బుయేతరుల మధ్య జరిగిన ఆదివాసీల ఘర్షణలో ఆదివారం 168 మంది మరణించారని సూడాన్ సహాయక బృందం తెలిపింది. పశ్చిమ డార్ఫర్ ప్రావిన్స్లోని క్రినిక్ ప్రాంతంలో జరిగిన హింసాకాండలో 98 మంది గాయపడ్డారని డార్ఫర్లోని శరణార్థులు, నిర్వాసితుల జనరల్ కోఆర్డినేషన్ ప్రతినిధి ఆడమ్ రీగల్ తెలిపారు. రీగల్ ప్రకారం, గురువారం క్రినిక్లో గుర్తు తెలియని దుండగుడు ఇద్దరు వ్యక్తులను చంపిన తర్వాత వివాదం రాజుకుందని తెలిపారు.
కొంతకాలం క్రితం అరబ్బులు, అరబ్బుయేతరులు మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. గత గురువారం వెస్ట్ డార్ఫర్ ప్రావిన్షియల్ రాజధాని జెనెనాకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్రెనిక్లో గుర్తు తెలియని దుండగుడు ఇద్దరు వ్యక్తులను హతమార్చడంతో ఘర్షణలు చెలరేగాయి. ఇక ఆదివారం క్రెనిక్లో ఆయుధాలతో దాడి చేసి ఇళ్లలో చొరబడి సొమ్మును దోచుకున్నారు. అనంతరం వాటిని తగలబెట్టారు.
అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం క్రినిక్లో ఇద్దరు మరణించిన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఆ తర్వాత హింస నగరంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించిందని స్థానిక మీడియా పేర్కొంది. పశ్చిమ డార్ఫర్లోని సూడాన్ వైద్యుల కమిటీ కనీసం 132 మంది గాయపడ్డారని చెప్పారు. సోమవారం కూడా గొడవలు కొనసాగాయి. ఆదివారం అర్థరాత్రి సాయుధ వ్యక్తులు కూడా అంబులెన్స్పై కాల్పులు జరిపారని పేర్కొంది. ఈ ఘటనలో ముగ్గురు ఆరోగ్య సిబ్బందికి గాయాలయ్యాయి.
ఈ ఘర్షణలు క్రెనిక్ నుండి జెనీనా ప్రాంతం వరకు చేరాయి. ముందుగా అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురిపై కాల్పులు జరిపారు. హింసను పోలీసులు అడ్డుకోవాలని ఎంత ప్రయత్నించినా.. అవి అదుపులోకి రాలేదు. అందుకే ఇప్పటివరకు జరిగిన ఘర్షణల్లో 3 లక్షల మంది వరకు మృతి చెందగా.. 2.5 మిలియన్ల మంది జనం నిరాశ్రయులయ్యారు. అందులో ఆదివారం ఒక్కరోజే 168 మంది మరణించగా.. మరో 98 మంది తీవ్రంగా గాయపడ్డారు.
డార్ఫర్లో శరణార్థి శిబిరాలను నిర్వహించడంలో సహాయపడే స్థానిక సంస్థ ప్రతినిధి ఆడమ్ రీగల్ మాట్లాడుతూ, సోమవారం జినినాలోని స్థానభ్రంశం చెందిన ప్రజల శిబిరంపై తుపాకీ కాల్పులు జరిగాయి, అనేక గృహాలు దగ్ధమయ్యాయి. డార్ఫర్ వంటి ప్రాంతాల్లో దశాబ్దాల తిరుగుబాటును అంతం చేయడానికి సుడాన్ పరివర్తన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఈ సంఘర్షణ సవాలుగా ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో వెస్ట్ డార్ఫర్, సౌత్ డార్ఫర్ ప్రావిన్సులలో జరిగిన గిరిజన హింసలో దాదాపు 470 మంది చనిపోయారు.