14 మంది మహిళా ఖైదీలకు కరోనా పాజిటివ్
మధ్య ప్రదేశ్ లో గణనీయంగా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో 14 మంది మహిళా ఖైదీలకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. పట్టణాలకే పరిమితమైన మహమ్మారి పల్లెలకు పాకింది. బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వారితో పాటు ఇళ్లల్లో ఉన్నవారిని సైతం వదలడం లేదు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ రోజురోజుకూ నలుమూలాల కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. అటు మధ్య ప్రదేశ్ లో గణనీయంగా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో 14 మంది మహిళా ఖైదీలకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా మధ్యప్రదేశ్లోని సింగ్రౌలి జిల్లాలోని బైధన్ జైలు నుంచి షాడోల్ జైలుకు తరలించిన కొద్ది రోజుల తరువాత 14 మంది మహిళా ఖైదీలకు కరోనా వైరస్ సోకినట్లు సీనియర్ అధికారి ఒకరు బుధవారం తెలిపారు. మంగళవారం సాయంత్రం వారిని షాడోల్ మెడికల్ కాలేజీకి తరలించినట్లు షాడోల్ జిల్లా జైలు సూపరింటెండెంట్ జీకే నేతి పేర్కొన్నారు. వారితో పాటు జైలులోని మిగతా వారికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఇక, జైలు పరిసరాలను పూర్తిగా శానిటైజ్ చేసినట్లు వెల్లడించారు.