ఆమె ఎవరు ? అసలు ఏం జరిగింది..? మిస్టరీగా చెవేళ్ల దిశ ఘటన

చిలుకూరు-వికారాబాద్‌ రహదారిపై రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లి వంతెన కింద మంగళవారం గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించడంతో కలకలం రేగింది. మ‌ృతిచెందిన ఆ మహిళ ఎవరు..? ఆమెను హత్యచేసింది ఎవరు..? అన్నది మాత్రం మిస్టరీగానే మారిపోయింది...

ఆమె ఎవరు ? అసలు ఏం జరిగింది..?  మిస్టరీగా చెవేళ్ల దిశ ఘటన
Follow us

|

Updated on: Mar 18, 2020 | 2:32 PM

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటన మరువకముందే రంగారెడ్డి జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. చిలుకూరు-వికారాబాద్‌ రహదారిపై రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లి వంతెన కింద మంగళవారం గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించడంతో కలకలం రేగింది. ఆమె తల ఛిద్రమై ఉంది. శరీరంపై దుస్తులు లేవు. మహిళను గుర్తుతెలియని దుండగులు అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో మరోమారు ఈ వార్త సంచలనంగా మారింది. అయితే, మ‌ృతిచెందిన ఆ మహిళ ఎవరు..? ఆమెను హత్యచేసింది ఎవరు..? అన్నది మాత్రం మిస్టరీగానే మారిపోయింది.

మంగళవారం తెల్లవారుజామున తంగడపల్లి శివారులోని వంతెన కింద గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మహిళ ఒంటిపై దుస్తులు లేకపోవడంతో ఆమెను అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తూ కేసు నమోదు చేసుకున్నారు. యువతి మృతదేహంపై గుర్తించిన బంగారు గొలుసు, చెవి కమ్మలు, ఉంగరం స్వాధీనం చేసుకున్నారు. ఆమెను ఎక్కడి నుంచో తీసుకొచ్చి అత్యాచారం చేసి, హత్య చేసి ఉంటారని .. యువతిని గుర్తించకుండా ఉండటం కోసం తలపై రాయితో బాదినట్టుగా భావించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మహిళ హత్య వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులకు సంబంధించి ఎటువంటి ఆనవాళ్లు లభ్యం కాలేదంటున్నారు పోలీసులు. 24 గంటలు గడిచిపోయినప్పటికీ ఎటువంటి ఆధారాలు లభించకపోవటంతో ఘటన మిస్టరీగానే మారిపోయింది. దీంతో కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు..ఐదు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హత్య ఉదాంతంలో ముగ్గురి హస్తం ఉండి ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు, అక్రమ సంబంధం కారణంగానే హత్య జరిగి ఉంటుందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళ డీఎన్‌ఏ నమూనాలను ఉస్మానియా ఫోరెన్సిక్ కి పంపించారు.