వైద్యం వికటించి గర్భిణీ మృతి..! బంధువుల ఆందోళన
పులివెందులలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో వైద్యం వికటించి గర్భిణీ మృతి. డాక్టర్ నిర్లక్ష్యం వల్లే మృతి చెందినట్లు బంధువుల ఆరోపణ
వైద్యుల నిర్లక్ష్యం ఓ నిండుగర్భిణీ ప్రాణాలు బలితీసుకుంది. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనిస్తానని ఎన్నో కలలు గన్న ఆ జంటకు తీరని విషాదం మిగిల్చింది. కడప జిల్లాలో చోటు చేసుకున్న ఈ సంఘటనతో మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు భారీగా మోహరించటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాకు చెందిన ఓ గర్భిణీ పులివెందులలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతున్న క్రమంలోనే పరిస్థితి విషమించి ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో మహిళ మృతికి ఆస్పత్రి వైద్యులే కారణమంటూ..మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా తమ బిడ్డ చనిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రిపై దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మోహరించారు. మృతురాలి బంధువులు, ఆస్పత్రి వర్గాల వాగ్వాదం నేపథ్యంలో పోలీసుల రాకతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది.