భార్య శాంపిల్స్ని పనిమనిషి పేరు మీద పంపిన డాక్టర్
కరోనా లక్షణాలతో బాధపడుతున్న తన భార్య శాంపిల్స్ను పనిమనిషి పేరు మీద పంపి బుక్కయ్యాడు ఓ డాక్టర్. దీంతో ఆ డాక్టర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది.
కరోనా లక్షణాలతో బాధపడుతున్న తన భార్య శాంపిల్స్ను పనిమనిషి పేరు మీద పంపి బుక్కయ్యాడు ఓ డాక్టర్. దీంతో ఆ డాక్టర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సింగ్రౌలి ప్రాంతంలో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యుడు తన కుటుంబంతో కలిసి ఇటీవల ఉత్తరప్రదేశ్లోని ఓ పెళ్లికి హాజరయ్యాడు. పై అధికారులు సెలవులు ఇవ్వకపోయినప్పటికీ డాక్టర్ కుటుంబం యూపీకి వెళ్లింది. జూన్ 23న వివాహానికి హాజరై.. జూలై 1న తిరిగి ఇంటికి వచ్చింది.
ఇక నిబంధనల ప్రకారం హోం క్వారంటైన్లో ఉండకుండా ఆ డాక్టర్ విధులకు హాజరయ్యాడు. ఆ తరువాత ఆయన భార్యలో కరోనా లక్షణాలు కనిపించాయి. అయితే ఆమెకు నిర్ధారణ పరీక్షలు చేయిస్తే.. తాను ఉత్తరప్రదేశ్కి వెళ్లి వచ్చిన విషయం బయటపడుతుందని భావించిన ఆ డాక్టర్.. భార్య శాంపిల్స్ని ఇంట్లో పని మనిషి పేరిట పంపాడు. ఇక ఆ పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ అవ్వడంతో, అధికారులు పనిమనిషి ఇంటికి చేరుకున్నారు. దీంతో వైద్యుడి భాగోతం బయటపడింది. ఇక ఆ తరువాత డాక్టర్ కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా.. అతడితో పాటు ఇంట్లోని మరో ఇద్దరికి పాజిటివ్గా తేలింది. ఈ క్రమంలో క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు, ఇతరుల పేరుతో శాంపిల్స్ని పంపినందుకు ఆ డాక్టర్పై ఎపిడమిక్ చట్టం కింద కేసు నమోదు చేశారు. కోలుకొని ఆసుపత్రి నుంచి వచ్చిన తరువాత డాక్టర్పై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇక వైద్యుడికి పాజిటివ్గా తేలడంతో అతడి కార్యాలయంలో పనిచేసే 33 మంది సిబ్బంది ఐసోలేషన్లోకి వెళ్లాల్సి వచ్చింది.