యూపీ: పులులకు ఆవాసాలుగా చెరుకు తోటలు..
అడవుల్లో ఉండే పెద్దపులులు ఇప్పుడు జనావాసాల్లోకి వచ్చి చేరుతున్నాయి. కొండగుహలు, చెట్ల పొదల్లో దాచుకునే పులులు ఇప్పుడు చెరుకు తోటలను ఆవాసాలుగా మార్చుకుంటున్నాయి.
అడవుల్లో ఉండే పెద్దపులులు ఇప్పుడు జనావాసాల్లోకి వచ్చి చేరుతున్నాయి. కొండగుహలు, చెట్ల పొదల్లో దాచుకునే పులులు ఇప్పుడు చెరుకు తోటలను ఆవాసాలుగా మార్చుకుంటున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా పదుల సంఖ్యలో పులులు చెరుకుతోటల్లోనే కాపురం పెట్టేస్తున్నాయి. యూపిలోని ఫిలిబిత్ జిల్లాలో చెరుకుతోటల్లో నివసిస్తున్న పులులను గుర్తించారు అధికారులు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫిలిబిత్ జిల్లాలో పలుచోట్ల చెరుకుతోటల్లో పులులు సంచరిస్తున్నట్లుగా గుర్తించారు. ఫిలిబిత్ జిల్లాలోని అమర్యా ప్రాంతంలో గల చెరుకు పొలాల్లో 8ఏళ్ల క్రితం మూడు పిల్లలతో ఓ పులి కనిపించింది. అయితే, అది అడవి నుంచి తప్పిపోయి వచ్చి ఉంటుందని అధికారులు భావించారు. కానీ, అది అక్కడే ఆవాసం ఏర్పాటు చేసుకున్నట్లుగా ఇటీవల ఓ అధ్యయనం ద్వారా తెలిసింది.
2019నాటికి అమర్యాలో ఇటువంటివి 10 పులులు ఉన్నాయని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అమర్యాకు 150కిలోమీటర్ల దూరంలోని లకీమ్పూర్కేరిలోని మోహమ్మద్ శ్రేణిలో గల చెరుకు తోటలు కూడా పులులకు నివాసప్రాంతాలుగా మారాయని, అక్కడ మరో మూడు పులులు సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అతిపెద్ద అటవీ సంపద కలిగిన జార్ఘండ్ (5) కంటే కూడా అమర్యా, మోహమ్మద్ ప్రాంతాల్లోని చెరుకు పొలాల్లోనే (13)ఎక్కువ పులులు ఉన్నట్లు పులుల సంరక్షణ అధికారులు చెబుతున్నారు.
జాతీయ పులుల సంరక్షణ అధికారుల తాజా లెక్కల ప్రకారం ఛత్తీస్ఘడ్ (19)లో 2/3 వంతుల పులులు ఉన్నట్లుగా వెల్లడించారు. దేశంలో గల 50 పులుల సంరక్షణ ప్రాంతాల్లోని 20 ప్రాంతాల్లో కెల్లా అత్యధిక పులులు అమర్యాలోనే ఉన్నట్లుగా తాజా అధ్యయనం వెల్లడైనట్లు పులుల సంరక్షణ అధికారులు పేర్కొన్నారు.