టాలీవుడ్లో ‘హీరోయిన్’కు ఏమైంది..!
టాలీవుడ్.. భారత సినీ ఇండస్ట్రీలో బాలీవుడ్ తరువాత అతి పెద్ద ఇండస్ట్రీ. ఎంతోమంది కళాకారులకు జీవితాన్ని ప్రసాదించిన టాలీవుడ్.. బాహుబలితో ప్రపంచ ఖ్యాతిని కూడా సంపాదించుకుంది. అంతేనా ఇక్కడ కెరీర్ను ప్రారంభించిన ఎంతోమంది నటీనటులు.. మిగిలిన భాషల్లో స్టార్లుగా ఎదిగారు. ఒకప్పుడు టాలీవుడ్ అంటే మూస కథలు అన్న వారందరూ.. ఇప్పుడు మన సినిమాలవైపు కన్నేశారు. మన దర్శకులను, మన నటీనటులను, మన టెక్నీషియన్లను వారు ఎగరేసుకుపోతున్నారు. కాస్త టాలెంట్ చూపిస్తే చాలు.. పిలిచి మరీ అవకాశాలు […]
టాలీవుడ్.. భారత సినీ ఇండస్ట్రీలో బాలీవుడ్ తరువాత అతి పెద్ద ఇండస్ట్రీ. ఎంతోమంది కళాకారులకు జీవితాన్ని ప్రసాదించిన టాలీవుడ్.. బాహుబలితో ప్రపంచ ఖ్యాతిని కూడా సంపాదించుకుంది. అంతేనా ఇక్కడ కెరీర్ను ప్రారంభించిన ఎంతోమంది నటీనటులు.. మిగిలిన భాషల్లో స్టార్లుగా ఎదిగారు. ఒకప్పుడు టాలీవుడ్ అంటే మూస కథలు అన్న వారందరూ.. ఇప్పుడు మన సినిమాలవైపు కన్నేశారు. మన దర్శకులను, మన నటీనటులను, మన టెక్నీషియన్లను వారు ఎగరేసుకుపోతున్నారు. కాస్త టాలెంట్ చూపిస్తే చాలు.. పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నారు. ఇంతటి ఖ్యాతి సాధించినప్పటికీ.. టాలీవుడ్లో ఏదో కొంత నిరాశ వినిపిస్తోంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో టాలీవుడ్ చిన్న చూపు చూస్తుందని సినీ విశ్లేషకులు చెప్పుకుంటూ వస్తున్నారు. అంతేకాదు ఈ విషయాన్ని కొంతమంది హీరోయిన్లు సైతం బహిరంగంగా చెప్పుకొచ్చారు.
టాలీవుడ్లో హీరోయిన్లను కేవలం సినిమాకు గ్లామర్ కోసమే వాడుకుంటారని, హీరోయిన్కు సరైన ప్రాధాన్యం ఇవ్వరని, సినిమా ఫ్లాప్ల విషయంలో కారణాలెన్నో ఉన్నా.. హీరోయిన్లనే టార్గెట్ చేస్తారని.. వారిపై ఐరన్ లెగ్ ముద్ర వేస్తారని, అమ్మాయిలను ఒక వస్తువుగా చూస్తారని.. సమంత, తాప్సీ, రాధికా ఆప్టే లాంటి స్టార్ హీరోయిన్లు కూడా పలు సందర్భాల్లో కామెంట్లు చేశారు. ఇక తాజాగా టాలీవుడ్ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది కన్నడ బ్యూటీ శాన్వీ. రౌడీ సినిమా తరువాత తనకు తెలుగులో అవకాశాలు రాలేదని.. ఆ సమయంలో తన మీద తనకే నమ్మకం పోయిందని, దాదాపు ఏడాదిన్నర పాటు టాలీవుడ్లో అవకాశాల కోసం ఎదురుచూశానని.. ఎక్కడ తప్పు జరిగిందో తెలీక ఏడ్చేదాన్నని ఆమె తన బాధను వ్యక్తపరిచింది. ఇప్పుడైనా తెలుగు వారు తనలోని టాలెంట్ను గుర్తించి అవకాశాలు ఇస్తారని ఎదురుచూస్తున్నానంటూ ఆమె చెప్పుకొచ్చింది. రక్షిత్ శెట్టి సరసన ఆమె నటించిన అవనే శ్రీమన్నారయణ చిత్రం తెలుగులో అతడే శ్రీమన్నారయణ పేరుతో వస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన శాన్వీ.. అవకాశాలు ఇవ్వండి అంటూ స్టేజ్ పైనే ఏడ్చేసింది.
అయితే టాలీవుడ్లో హీరోయిన్కు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన దర్శకులు లేకపోలేదు. కె.విశ్వనాథ్, బాపు, ఈవీవీ సత్యానారాయణ, కోడి రామకృష్ణ, టి. కృష్ణ, కృష్ణవంశీ, వంశీ వంటి దర్శకులు తమ సినిమాల్లో హీరోయిన్లకు మంచి ప్రాధాన్యత ఇచ్చేవారు. అంతేకాదు వీరిలో ఇద్దరు, ముగ్గురు దర్శకులు.. లేడి ఓరియెంటెడ్ సినిమాలు కూడా తీశారు. కానీ రాను రాను హీరోయిన్లకు ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది. అందం, అభినయం ఉన్నప్పటికీ అవకాశాలు లేక టాలీవుడ్కు దూరమైన హీరోయిన్ల లిస్ట్ బాగానే ఉంది. అలాగని ఇప్పుడున్న దర్శకుల్లో హీరోయిన్లకు ప్రాధాన్యత ఇచ్చే వారు కూడా లేకపోలేదు. ముఖ్యంగా అనుష్క, కాజల్, సమంత లాంటి స్టార్ హీరోయిన్లు లేడి ఓరియెంటెడ్ కథలపై దృష్టి పెడుతుండటంతో.. వారికి అనుగుణంగా దర్శకులు కూడా కథలను తయారు చేస్తున్నారు. ఇక ఈ మధ్యకాలంలో టాలీవుడ్లో విభిన్న కథలకే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు కాబట్టి.. ఇప్పుడున్న దర్శకులు గానీ.. రాబోయే దర్శకులు గానీ హీరోయిన్లకు తగినంత ప్రాధాన్యతను ఇస్తే.. మన ఇండస్ట్రీ ఖ్యాతి మరింత పెరిగే అవకాశం ఉందనడంలో ఎలాంటి సందేహం ఉండదు.