రాజస్థాన్ రాజకీయ వ్యవహారాలపై వసంధర ఎందుకు మౌనంగా ఉంటున్నారు?
రాజకీయంగా ఇంత హడావుడి జరుగుతున్నా.. రెండుసార్లు రాజస్థాన్కు ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన సీనియర్ నేత వసుంధరా రాజే మాత్రం మౌనంగా ఉంటున్నారు.. ఆమె మౌనం పలు సందేహాలకు తావిస్తోంది.
రాజకీయాలపై కాసింత ఆసక్తి ఉన్నవారంతా నిన్నటి నుంచి తెగ ఉత్కంఠకు గురయ్యారు.. సచిన్ పైలట్ను కాంగ్రెస్పార్టీ బహిష్కరించిన తర్వాత ఆయన కాషాయం కండువా వేసుకుంటారా? లేక సొంతంగా పార్టీ పెట్టుకుంటారా? అన్న సందేహాలకు తెర దించుతూ సచిన్ పైలట్ తాను బీజేపీలో చేరడం లేదని స్పష్టం చేసేశారు.. ఎప్పుడైతే కాంగ్రెస్పార్టీ సచిన్ను కాదనుకుందో అప్పటి నుంచే బీజేపీ ఆయన కోసం తలుపులు తెరిచి ఉంచింది.. రారమ్మని పిలిచింది.. ఎప్పుడంటే అప్పుడు తమ పార్టీలోకి రావచ్చని, సదా ద్వారాలు తెరిచే ఉంటాయని వెల్లడించింది. తమ పార్టీ విధానాలు నచ్చినవారు ఎవరినైనా ఆహ్వానిస్తామని ప్రకటించింది..
బీజేపీ సీనియర్ నేతల ఉత్సాహం
రాజస్థాన్లోని రాజకీయ పరిణామాలపై తమకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర నాయకులు చెబుతున్నా.. రాష్ట్ర నేతలు మాత్రం సచిన్ పైలట్ను పార్టీలోకి లాగేందుకు విపరీతంగా ప్రయత్నించారు.. బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా, ఆ పార్టీ ఎంపీ ఓం ప్రకాశ్ మాథుర్, రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సతీష్ పూనియా, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్లతో పాటు చాలా మంది సీనియర్ నేతలు సచిన్ పైలట్పై ఎక్కడలేని సానుభూతిని ప్రకటించారు.
మాట కూడా మాట్లాడని వసుంధరా రాజే
రాజకీయంగా ఇంత హడావుడి జరుగుతున్నా.. రెండుసార్లు రాజస్థాన్కు ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన సీనియర్ నేత వసుంధరా రాజే మాత్రం మౌనంగా ఉంటున్నారు.. ఆమె మౌనం పలు సందేహాలకు తావిస్తోంది. రాజస్థాన్ కాంగ్రెస్లో జరిగిన పరిణామాలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేకపోయినా ఇంతమంది ప్రముఖ నేతలు తమకు తోచిన వ్యాఖ్యానాలు చేస్తే వసుంధరా మాత్రం బహిరంగంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు సరికదా, సోషల్ మీడియాలో కూడా ఎలాంటి స్పందనను కనబర్చలేదు. గత 24 గంటలలో ఆమె చేసిన ట్వీట్లు రాజకీయాలకు సంబంధించినవి కాకపోవడం విశేషం. గోవుల గురించి, సంఘసంస్కర్త గోపాల్ గణేశ్ అగార్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయన గురించి నాలుగు మాటలు, ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ రాజుభయ్యా వర్ధంతి సందర్భంగా ఆయన గురించి మూడు ముక్కలు, త్రిపుర ప్రజలు జరుపుకునే కెర్ పూజను ప్రస్తావిస్తూ వారికి శుభాకాంక్షలు చెప్పడం చేశారే తప్ప అసలు రాజస్థాన్ రాజకీయ వ్యవహారాలపై మాట మాత్రం మాట్లాడలేదు.. బహుశా అదంతా కాంగ్రెస్ అంతర్గత వ్యవహారంగా ఆమె భావించి ఉండవచ్చు. లేదూ పార్టీ హైకమాండ్తో ఆమెకు దూరం పెరగడం కావచ్చు..
పార్టీ హైకమాండ్ జాగ్రత్త పడింది
రెండు రోజులుగా రాజస్థాన్లో రగిలిన రాజకీయంపై వసుంధర జోక్యం చేసుకోకుండా హైకమాండ్ జాగ్రత్త పడింది.. జాగ్రత్త పడిందనడం కంటే దూరం పెట్టిందంటే బాగుంటుంది.. కేంద్ర నాయకత్వంతో ఆమెకు సత్సంబంధాలు లేవన్నది ఈ ఎపిసోడ్తో మరోమారు రుజువయ్యింది. చాలా మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఆమె నాయకత్వంలో పని చేయడానికే ఇష్టపడుతున్నారు. అయినా ఆమెను విశ్వాసంలోకి తీసుకోకుండా రాజస్థాన్లో రాజకీయ సమీకరణాలను మార్చాలనుకోవడం సరైంది కాదని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఒకవేళ గెహ్లాట్ ప్రభుత్వం కుప్పకూలి, భవిష్యత్తులో ఉప ఎన్నికలంటూ జరిగితే ఆమె మద్దతు చాలా అవసరమని, రాష్ట్రంలో ఆమెకున్న చరిస్మా అలాంటిదని చెప్పుకొచ్చారు. ఆమెను కాదని ఎన్నికలకు వెళ్లే సాహసం బీజేపీ చేస్తుందని తాను భావించడం లేదని కూడా అన్నారు. గత కొంతకాలంలో పార్టీ కార్యక్రమాలలో కూడా ఆమె పాల్గొనడం లేదు. గత నెల 27న కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నిర్వహించిన వర్చువల్ జన్ సంవాద్ ర్యాలీలో ఆమె కనిపించారంతే! గత వారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నిర్వహించిన వర్చవల్ సమావేశానికి ఆమె గైర్హాజరు అయ్యారు. ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్ మాత్రం హాజరయ్యారు.
ఇంటికే పరిమితమవుతున్న వసుంధర
ధోల్పూర్లోని నివాసంలోనే ఆమె ఎక్కువగా గడుపుతున్నారు.. రాజకీయాలపై ఎక్కువగా ఆసక్తి కనబర్చడం లేదు. పైగా గెహ్లట్తో వసుంధర రాజేకు ఎలాంటి రాజకీయ కక్షలు లేవు.. గెహ్లాట్ కూడా వసుంధరపై ఇప్పటి వరకు చిన్నపాటి విమర్శ కూడా చేయలేదు. ఎంతసేపూ మోదీ, అమిత్షాపై తీవ్ర విమర్శలు చేస్తారే తప్ప వసుంధర గురించి పల్లెత్తు మాట కూడా అనరు. ఈ మధ్యనే ఆమెకు చాలా కావాల్సిన ఓ అధికారిని తన పరిపాలనావిభాగంలోని ఓ పెద్ద పోస్టులో నియమించుకున్నారు..
అమిత్షా అంటే గిట్టని వసుంధర
2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిననాటి నుంచే వసుంధరా రాజేకు హైకమాండ్తో సంబంధాలు సన్నగిల్లడం మొదలయ్యాయి.. తన కుమారుడికి కేంద్ర పదవి కోసం ఆమె గట్టిగా ప్రయత్నించారు కానీ.. ఆ ప్రయత్నాలకు అమిత్షా అడ్డుతగిలారు.. మోదీతో కాస్తో కూస్తో మంచి సంబంధాలే ఉన్నా.. అమిత్షా అంటే మాత్రం వసుంధరారాజేకు అస్సలు పడదు. ఆమె రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో అమిత్ షాకు రాష్ట్ర పార్టీ వ్యవహారాలలో తల దూర్చేనిచ్చేవారు కాదు! అమిత్ షా కూడా ఆ సాహసం చేసేవారు కాదు.. 2018లో అసెంబ్లీ ఎన్నికల ముందు .. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా గజేంద్ర షెఖావత్ను నియమించాలని షా భావించడం, దాన్ని వసుంధర ఇష్టపడకపోవడం జరిగాయి.. అప్పట్నుంచి ఇద్దరి మధ్య ఒక రకమైన వైరం మొదలయ్యింది. రాష్ట్ర పార్టీ బాధ్యతలు మదన్లాల్ సైనికి అప్పగించిన తర్వాత వసంధర కాస్త స్థిమితపడగలిగారు.. వర్తమాన పరిస్థితులకు వస్తే గెహ్లట్ ప్రభుత్వాన్ని దొడ్డిదారిన కూల్చాలనుకోవడాన్ని వసుంధర ఇష్టపడలేదు.. అందుకే ఈ వ్యవహారానికి చాలా దూరంగా ఉండిపోయారామె! మౌనం పాటిస్తున్నారామె!