ధారావిపై ప్రశంసలు కురిపించిన డబ్ల్యూహెచ్ఓ
ఆసియాలోనే అతి పెద్ద మురికివాడల్లో ఒకటైన ముంబయిలోని ధారావిలో కరోనా సోకిన సమయంలో అందరిలో ఆందోళన ఎక్కువగా ఉండేది
ఆసియాలోనే అతి పెద్ద మురికివాడల్లో ఒకటైన ముంబయిలోని ధారావిలో కరోనా సోకిన సమయంలో అందరిలో ఆందోళన ఎక్కువగా ఉండేది. ఇరుకుగా ఉండే ఆ వాడల్లో పది లక్షల మందికి పైగా నివసిస్తుండగా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందని, దాన్ని కట్టడి చేయడం కష్టమని అందరూ భావించారు. అయితే మొదటి నుంచి అలర్ట్ అయిన అక్కడి అధికారులు ఆ ప్రాంతంలో కరోనా గొలుసుకు బ్రేక్ వేయగలిగారు. పూర్తిగా కాకపోయినా.. ధారావిలో కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ధారావిపై ప్రశంసలు కురిపించింది. సరైన జాగ్రత్తలు పాటిస్తే వైరస్పై విజయం సాధించగలమని ధారావి నిరూపించిందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ గేబ్రియేసస్ అన్నారు.
శుక్రవారం జెనీవాలో మాట్లాడిన టెడ్రోస్.. గత ఆరు వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా కేసుల సంఖ్య రెట్టింపు అయ్యింది. కానీ ఎక్కువ జనాభా ఉన్న కొన్ని ప్రాంతాల్లో వైరస్ని కట్టడి చేసిన తీరును గమనిస్తే.. కేసుల సంఖ్య పెరిగినా కరోనాను అదుపులోకి తీసుకు రావొచ్చనే విషయం అర్థమవుతోంది. ఇటలీ, స్పెయిన్, దక్షిణ కొరియా దేశాలు సహా ముంబయిలోని ధారావి వంటి ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని నియంత్రించిన తీరే దీనికి ఉదాహరణ. టెస్టింగ్, ట్రేసింగ్, ఐసోలేషన్, అనారోగ్యంతో ఉన్న వారికి ట్రీట్మెంట్ వంటి విధానాలు వైరస్ వ్యాప్తిని కట్టడి చేశాయి. వైరస్ని అణిచివేయగలమని నిరూపించాయి అని వెల్లడించారు. కాగా శుక్రవారం నాటికి ధారావిలో మొత్తం 2359 కేసులు ఉండగా.. గడిచిన 24 గంటల్లో 35 మంది కరోనా బారిన పడ్డారు.