నేత్ర పర్వంగా స్నపన తిరుమంజనం.. ఆకర్షణగా చిలకల మాలలు, కిరీటాలు

05 October 2024

TV9 Telugu

Pic credit -  TTD

శ్రీ‌వారి స్న‌ప‌న తిరుమంజ‌నంలో శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని స్పృశించే అవ‌కాశం శ్రీవల్లి పుత్తూరు నుండి మొదటిసారిగా తెచ్చిన చిలకలతో చేసిన మాల‌లు, కిరీటాలకు దక్కింది. 

శనివారం ఆలయంలోని రంగనాయకుల మండపంలో మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల వరకు వేద మంత్రోచ్ఛారణ మధ్య స్న‌ప‌న తిరుమంజ‌నం శాస్త్రోక్తంగా జరిగింది.

ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు.

రంగురంగుల ఆర్కిడ్ పుష్పాలల‌తో వేదిక‌ను సుంద‌రంగా తీర్చిదిద్దారు.

అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు.

ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రములు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో పారాయణం చేశారు. 

అభిషేకానంతరం వివిధ పాశురాలను తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్లు పఠించారు. 

ఈ వేడుకలో ఏలకులు, వట్టి వేరు, బాదం, వివిధ రకాల డ్రై ఫ్రూట్స్, చంద‌నం, న‌ల్ల ద్రాక్ష, రోజ్ పెట‌ల్స్‌. తులసి దండలు స్వామి అమ్మవార్లకు అలంకరించారు.

టీటీడీ గార్డెన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రత్యేక అలంకరణలు చేశారు. ఒక్క టన్ను సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్, పండ్లు, లతలతో వేదికను శోభాయమానంగా అలంకరించారు. 

 శ్రీ మలయప్ప స్వామివారికి రూపొందించిన పూలమాలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చెన్నైకి చెందిన దాత ఈ మాలలను విరాళంగా అందించారు.