బాలీవుడ్ బాద్ షా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా తనకంటూ ఓ స్టార్ డమ్ సంపాదించుకున్నారు షారుఖ్ ఖాన్.

ఆయనకు అభిమానులు కాదు.. వీరాభిమానులు ఉంటారు. ఇక షారుఖ్ సైతం అభిమానుల పట్ల చూపించే ప్రేమ తెలిసిందే.

తనను ఆరాధించే ఫ్యాన్స్ ఎవరైనా తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందిపడుతుంటే.. వారితో మాట్లాడి ధైర్యాన్ని ఇచ్చేందుకు ముందుంటారు.

ఇప్పటికే అనేకసార్లు తమ అభిమానులకు సాయం చేసిన షారుఖ్ ఇప్పుడు మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు.

క్యాన్సర్ తో పోరాటం చేస్తోన్న తన అభిమానికి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. చికిత్సకు అవసరమైన ఆర్థిక సాయం చేస్తానని ఆమెకు మాటిచ్చారు.

కోల్ కత్తాకు చెందిన 60 ఏళ్ల శివానీ చక్రవర్తికి షారుఖ్ అంటే అమితమైన ఇష్టం. చిన్నతనం నుంచి షారుఖ్ నటించిన సినిమాలను చూసి అతడికి వీరాభిమాని అయిపోయింది.

జీవితంలో ఒక్కసారైనా ఆయన్ని కలవాలని.. తన చేతి వంట రుచి చూపించాలని ఎంతో ఆశపడింది. కానీ.. కొన్నేళ్ల క్రితం ఆమె క్యాన్సర్ బారిన పడ్డారు.

ఇప్పుడు ఆమెకు క్యాన్సర్ చివరి దశలో ఉందని.. కొన్ని నెలల్లోనే చనిపోవచ్చని డాక్టర్స్ తెలిపారు. దీంతో ఆమె చివరి కోరిక తెలుసుకున్న కుమార్తె ప్రియ ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు.

అది చూసిన షారుఖ్ తాజాగా శివానీకీ వీడియో కాల్ చేశారు. సుమారు 40 నిమిషాలపాటు ఆమెతో వీడియో కాల్ మాట్లాడారు..