దేశవాళీలో ‘ట్రిపుల్’ సెంచరీ.. తొలి భారతీయుడిగా పృథ్వీ షా రికార్డ్..
భారత 23 ఏళ్ల యువ క్రికెటర్ పృథ్వీ షా రంజీ ట్రోఫీలో అస్సాంతో జరిగిన మ్యాచ్లో ట్రిపుల్ సెంచరీ చేసి ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు.
379 పరుగులు చేసిన తర్వాత షా దురదృష్టవశాత్తు ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.
దీంతో క్వాడ్రపుల్ సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడిగా నిలిచే అవకాశాన్ని కోల్పోయాడు.
ముంబై తరపున రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ చేసిన ఎనిమిదో బ్యాట్స్మెన్గా షా నిలిచాడు.
ముంబై తరపున అతిపెద్ద రంజీ ఇన్నింగ్స్ ఆడిన బ్యాట్స్మెన్గా కూడా నిలిచాడు.
ముంబై తరపున రంజీ ట్రోఫీలో అతిపెద్ద ఇన్నింగ్స్లో 377 పరుగుల సంజయ్ మంజ్రేకర్ పేరిట ఉన్న 32 ఏళ్ల రికార్డును పృథ్వీ బద్దలు కొట్టాడు.
తన ట్రిపుల్ సెంచరీతో పృథ్వీ దేశవాళీ క్రికెట్లో అద్వితీయ రికార్డును కూడా సృష్టించాడు.
రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ, విజయ్ హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సెంచరీ చేసిన తొలి బ్యాట్స్మెన్గా పృథ్వీ నిలిచాడు.
అతనికి ముందు దేశవాళీ క్రికెట్లో మరే ఇతర బ్యాట్స్మెన్ ఈ ఘనత సాధించలేకపోయాడు.