భారతదేశ జాతీయ జంతువు పులి.. ఇది అందరికి తెలిసిందే. 1973 సంవత్సరంలో భారత జాతీయ జంతువుగా పెద్ద పులిని ప్రకటించారు.
నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) ప్రకారం, భారతదేశం తన పులుల సంఖ్యను పదేళ్లలోపు రెట్టింపు చేసింది.
NTCA ప్రకారం, భారతదేశంలో 2010లో పులుల సంఖ్య 1,706గా ఉండగా, 2022 సంవత్సరం నాటికి అది 3,682కి పెరిగింది.
ప్రపంచంలోనే అత్యధిక పులుల సంఖ్యలో 75 శాతం భారతదేశం ఇప్పుడు నిలయంగా ఉందని NTCA తాజా నివేదిక తెలిపింది.
భారతదేశంలో పులులు దాదాపు 1.38 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. పులుల సంరక్షణకు 25% ప్రాంతం పూర్తిగా కేటాయించారు.
వేటను అరికట్టడం, పులుల ఆవాసాలను రక్షించడం, తగినంత ఆహారం లభించేలా చూడటం వల్ల దేశంలో పులులు సురక్షితంగా ఉంటున్నాయి.
మానవ-వన్యప్రాణుల సంఘర్షణను తగ్గించడం, స్థానిక సమాజాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ద్వారా దేశంలో పులుల సంఖ్య పెరిగింది.
భారతదేశం పులులతో పాటు, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, కారకల్ వంటి అంతరించిపోతున్న ఇతర జాతుల సంరక్షణపై కూడా దృష్టి పెట్టాలని వన్యప్రాణి నిపుణులు అభిప్రాయపడుతున్నారు.