‘భేదియా’ ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ్‌ ధావన్‌, కృతిసనన్‌ ఇటీవల ఓ బీటౌన్‌ రియాల్టీ షోలో పాల్గొన్నారు. 

పాన్‌ ఇండియా స్టార్‌ హీరో కృతితో ప్రేమలో ఉన్నారంటూ ఆ షోలో వరుణ్‌ వ్యాఖ్యలు చేశాడు. ‘‘కృతిసనన్‌ పేరు నా జాబితాలో లేదు. ఎందుకంటే ఆమె పేరు మరొకరి హృదయంలో ఉంది.

ఆ వ్యక్తి ప్రస్తుతం ముంబయిలో లేడు. వేరే ప్రాంతంలో షూట్‌లో ఉన్నాడు’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

నెటిజన్లు వరుణ్‌ మాట్లాడుతున్నది ప్రభాస్‌ గురించేనని భావించారు. మరోవైపు ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ వార్తలపై బాలీవుడ్‌ బ్యూటీ కృతి సనన్‌ స్పందించారు. 

అవన్నీ వదంతులు మాత్రమేనని కొట్టిపారేశారు. ‘‘ఇది ప్యార్‌ లేదా ప్రచారం కాదు. ఆ రియాల్టీ షోలో వరుణ్‌ ధావన్‌ కాస్త అత్యుత్సాహం కనబరిచాడు. 

అతడు సరదాగా అన్న మాటలు ఇప్పుడు ఎన్నో వార్తలకు నాంది పలికినట్లు అయ్యింది.

కొన్ని వెబ్‌సైట్లు నా వివాహ తేదీనీ ప్రకటించడానికి ముందే వీటికి నేను ఫుల్‌స్టాప్‌ పెడుతున్నా. వాటిల్లో ఎలాంటి నిజం లేదు’’ అని ఆమె క్లారిటీ ఇచ్చారు.