ప్రముఖ కమెడియన్‌ కిర్రాక్‌ ఆర్పీ పేరు ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో మార్మోగిపోతోంది. జబర్దస్త్ షో నుంచి బయటకు వచ్చిన అతను నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో కర్రీ పాయింట్‌ ప్రారంభించాడు.

ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుండడంతో బ్రాంచ్‌ల మీద బ్రాంచ్‌లు ఓపెన్‌ చేస్తున్నాడు. ఇప్పటికే కూకట్‌ పల్లి, మణికొండలో కర్రీ పాయింట్లను తెరచిన ఆర్పీ తాజాగా అమీర్‌పేటలో ముచ్చటగా మూడో బ్రాంచ్‌ను ప్రారంభించాడు.

ఇదిలా ఉంటే ఆర్పీ గతంలోనే లక్ష్మీ ప్రసన్న అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. అయితే పెళ్లిపై మాత్రం ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. తాజాగా అమీర్‌పేట బ్రాంచ్‌ ప్రారంభంలో లక్ష్మీ ప్రసన్న కూడా సందడి చేసింది.

ఇదే సందర్భంగా తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఆర్పీ. ‘నాకు అబద్ధాలు చెప్పడం రాదు. ఆమె వెంట రెండేండ్లు పిచ్చికుక్కలా తిరిగాను.

మొత్తానికి వాళ్ల తల్లిదండ్రులు మా పెళ్లికి ఒప్పుకున్నారు. ఈ ఏడాది నవంబర్ 29న పెళ్లి చేసుకోబోతున్నాం’ అని తమ పెళ్లి డేట్‌ను అనౌన్స్‌ చేశాడీ జబర్దస్త్ కమెడియన్.

జబర్దస్త్ షో ద్వారా మంచి క్రేజ్‌ సంపాదించుకున్న కమెడియన్స్ లో కిరాక్ ఆర్పీ ఒకరు. టీం లీడర్‌గా వ్యవహరిస్తూ తనదైన శైలిలో పంచులు, కామెడీ స్కిట్స్ తో ప్రేక్షకులను అలరించాడు.