నోటి ఆరోగ్యం మీద మనం అంతగా దృష్టి పెట్టం. పంటి నొప్పి వంటివి తలెత్తితే గానీ దీని ప్రాధాన్యమేంటో అర్థం కాదు.

ఉదయం నిద్ర లేచాక పళ్లు తోముకోవటంతోనే చాలామంది సరిపుచ్చుతుంటారు. నిజానికి రాత్రి పడుకోబోయే ముందూ బ్రష్‌తో పళ్లు తోముకోవటం తప్పనిసరి.

ఒకవేళ చాక్లెట్ల వంటివి తిన్నప్పుడు అవి అంటుకుపోతే పళ్లను పూర్తిగా శుభ్రం చేసుకోవాలని మరవద్దు.

భోజనం చేసిన ప్రతీసారీ నీటితో బాగా పుక్కిలించాలి. దీంతో పళ్ల మధ్యలో చిక్కుకున్న పదార్థాలు తొలగిపోతాయి. లేకపోతే బ్యాక్టీరియా పెరిగే ప్రమాదముంది.

నిమ్మ, ద్రాక్ష, పైనాపిల్‌, దానిమ్మ వంటి పుల్లటి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని ఆమ్లంతో పళ్ల మీది ఎనామిల్‌ దెబ్బతినే ప్రమాదముంది

మనకు నీరే అమృతం. తగినంత నీరు తాగితే ఆరోగ్యం అన్నిందాలా బాగుంటుంది. ఇది నోరు తడారకుండా చూస్తూ పళ్లకూ మేలు చేస్తుంది.

చక్కెరలేని గమ్‌ను నమలటం మంచిది. దీంతో నోట్లో లాలాజలం బాగా ఊరుతుంది. ఇది పళ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతుంది.