20 September 2023
ఆధునిక యుగంలో మారుతున్న జీవన శైలి కారణంగా ప్రపంచంలో అత్యధిక శాతం మంది అధిక రక్తపోటుతో బాధ పడుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా హైబీపీతో బాధపడుతన్న రోగుల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా సంచలన నివేదిక వెల్లడించింది.
అధిక రక్తపోటుతో బాధపడుతున్న ప్రతి అయిదుగురిలో నలుగురు సకాలంలో సరైన చికిత్సను పొందడం లేదని WHO రిపోర్ట్ ఇచ్చింది.
అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా హైబీపీ వల్లనే అత్యధిక మరణాలు నమోదు అవుతున్న విషయాన్ని ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది.
బీపీ గురించి ప్రజల్లో చైతన్యం కలిగిస్తే 2050 సంవత్సరం లోపు ప్రపంచంలో సుమారు ఏడున్నర కోట్ల మందిని బ్రతికించుకోవచ్చని WHO తెలిపింది.
ముఖ్యంగా భారత దేశంలో హైబీపీ కారణంగా మరణించే వారి సంఖ్య ఇతర దేశాల కన్నా అధికంగా ఉన్నట్టు గుర్తించారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు వయోజనుల్లో ఒకరికి హైపర్టెన్షన్ సోకుతుందని WHO తన రిపోర్టులో వెల్లడించింది.
అధిక రక్తపోటు వల్ల ప్రధానంగా బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ అటాక్, ఇతర గుండె సమస్యలు, కిడ్నీ డ్యామేజ్ వంటి సమస్యలు వాటిల్లే ప్రమాదం ఉంది.
140/90 mmHg లేదా అంతకన్నా ఎక్కువ స్థాయిలో బీపీ ఉన్న వ్యక్తులు 65 కోట్ల నుంచి 103 కోట్లకు చేరుకున్నట్లు WHO నివేదిక వెల్లడించింది.
వృద్దుల్లో, జన్యుపరమైన సమస్యలు ఉన్నవారిలో హైబీపీ సమస్యలు మరింత అధికంగా ఉందని నిపుణులు తేల్చారు.పౌష్టికాహారం, పొగాకు మనేయడం వల్ల హైబీపీని అదుపులో ఉంచుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.