పోషకాహారం అంటే ఏంటి..? ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి తీసుకోవాలి..

24 September 2023

శాస్త్రీయ విధానంలో పోషకాహారంపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా జాతీయ పోషకాహార సంస్థ సరికొత్త విధానాన్ని రూపొందించింది.

పోషకాహార ఆవశ్యకత, ఆహారంలోని పోషకాల వివరాలు, ఆరోగ్యాన్ని అందించే ఆహార పదార్థాల వివరాలతో కూడిన పట్టికను తయారు చేసి ప్రచారం చేస్తోంది.

శరీరానికి అవసరమైన 2000 కేలరీలను ధాన్యాలు, పప్పులు, పాలు, ఆకుకూరలు, పండ్లు, గింజలతో కలిపి తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాహారం దొరికినట్టే.

పోషకాహారం బదులుగా సప్లిమెంట్స్‌ తీసుకోవడం ద్వారా శరీరానికి మంచి చేసే బ్యాక్టీరియా వృద్ధి తగ్గిపోయే ఆస్కారం ఉంది.అజీర్తి, డయాబెటిస్‌ వంటి ఇతర రోగాల బారిన పడుతున్నారు.

అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు, ఖనిజాలు, కొవ్వులు, విటమిన్లు, ఇతర బయోయాక్టివ్‌ పదార్ధాల అవసరాన్ని తీర్చేలా సరైన నిష్పత్తిలో పోషకాహార పట్టికను తయారు చేశారు.

సమతుల్యమైన ఆహారంలోనే అన్ని పోషకాలు అందుతాయని, దీనికి ప్రత్యేకంగా ఎలాంటి మినరల్‌ సప్లిమెంట్లను తీసుకోవాల్సిన అవసరం ఏర్పడదని పోషకాహార నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కిడ్నీల్లో రాళ్ల ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే సమతుల ఆహారం తీసుకోవలి. మెదడుకు మంచి పోషకాలు సరఫరా కావడం వల్ల ఏకాగ్రత, మానసిక ఎదుగుదలతోపాటు, శరీరంలో ఇన్సులిన్‌ అదుపులో ఉంచుకునే వీలుంటుంది.

మై ప్లేట్‌ ఫర్‌ ద డే జాబితా ప్రకారం ధాన్యాలు 240 గ్రాములు, కొవ్వులు 27గ్రాములు, గింజలు 30 గ్రాములు, పప్పులు, మాంసం 90 గ్రాములు తీసుకోవాలి.

కూరగాయలు, ఆకుకూరలు 350 గ్రాములు, పండ్లు 150 గ్రాముల చొప్పున తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన 2వేల కేలరీల శక్తి లభిస్తుంది.

మాంసం తినని వారు ఎక్కువగా పప్పులను తీసుకోవడం వల్ల కండరాల వృద్ధికి అవసరమైన మాంసకృత్తులు లభిస్తాయని పోషకాహర నిపుణులు సూచిస్తున్నారు.