వాయుకాలుష్యంతో కలిగే అనారోగ్య సమస్యలు..

07 November 2023

వాయుకాలుష్యంతో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల వచ్చే ప్రమాదాలు ఇవే.

దేశ రాజధాని ఢిల్లీ ప్రజలు తీవ్రమైన వాయు కాలుష్యంతో విలవిల్లాడుతున్నారు. గాలి నాణ్యత తీవ్రంగా పడిపోవడంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.

వాయు కాలుష్యం హానికరమైందని, మానవ శరీరంపై తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపిస్తుందని, పలు రకాల క్యాన్సర్లకు కారణమవుతుందని వైద్యులు, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వాయు కాలుష్యానికి వివిధ రకాల క్యాన్సర్ల మధ్య సంబంధాన్ని తెలియజేసే శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని ఢిల్లీ ఎయిమ్స్ ప్రొఫెసర్ తెలిపారు.

వాయు కాలుష్యం శ్వాసకోశ వ్యవస్థకు హాని కలిగించడమే కాక గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాల వ్యాధులకు కూడా దారితీస్తుంది.

శరీరంలోని వివిధ వ్యవస్థలను ప్రభావితం చేస్తుందని, ఈ విషయాన్ని తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యమని ఆయన అన్నారు.

వైద్య ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కడుపులోని పిండానికి కూడా వాయు కాలుష్యం హానికరమేనని, పిండంపై దుష్ప్రభావాలు చూపుతుందని చెప్పారు.

అన్ని వయసులవారి మెదడు, గుండెను కాలుష్యం దెబ్బతీస్తుందని, ముందు జాగ్రత్తతో వ్యవహరించకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు.

కాగా ఢిల్లీలో వాయు నాణ్యత దారుణంగా పడిపోతోంది. వరుసగా నాలుగో రోజు ఆదివారం కూడా 'తీవ్రమైన' కేటగిరీలోనే ‘వాయు నాణ్యత ఇండెక్స్’ ఉంది.