ఇళయరాజా బయోపిక్‌లో ధనుష్‌ - వచ్చే ఏడాది సెట్స్ మీదకి!

01 నవంబర్ 2023

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా బయోపిక్‌లో తమిళ నటుడు ధనుష్ నటించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుందని కోలీవుడ్‌ సమాచారం.

2024లో షూటింగ్‌ మొదలుపెట్టి, 2025లో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇళయరాజా బయోపిక్‌ తెరకెక్కించాలన్నది కోలీవుడ్‌లో ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట.

ఆ మధ్య ఇళయరాజా తనయుడు యువన్‌ శంకర్‌ రాజా కూడా ఈ విషయం గురించి మాట్లాడారు. తన తండ్రి బయోపిక్‌ తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నారు.

జీవితంలో పట్టుదలతో ఎదిగిన అత్యున్నత వ్యక్తి గాథను స్క్రీన్‌ మీద చూడటానికి అందరూ ఇష్టపడతారని అన్నారు యువన్‌ శంకర్‌ రాజా.

తన తండ్రి ఇళయరాజా పాత్రలో ధనుష్‌ చేస్తే బావుంటుందని కూడా ఆయన తన మనసులోని మాటను ఓపెన్‌గా చెప్పేశారు.

యువన్‌ శంకర్‌ రాజా అన్నట్టుగానే, ఇళయరాజా బయోపిక్‌ చిత్రంలో నటించడానికి ధనుష్‌ అంగీకరించినట్టు సమాచారం.

ధనుష్‌ ఇప్పటిదాకా ఎన్నో రకాల జోనర్ల చిత్రాల్లో నటించారు. అయితే బయోపిక్‌ మాత్రం చేయలేదు. ఆయన నటించడానికి అంగీకరించిన ఫస్ట్ బయోపిక్‌ ఇదే.

80 ఏళ్ల స్వరకర్త ఇళయరాజా బయోపిక్‌లో నటించాలనే ప్రపోజల్‌ తన దగ్గరకు రాగానే వెంటనే ఓకే చెప్పేశారట ధనుష్‌.