దర్శకుడు అభినవ్ కశ్యప్ పై కోర్టులో కేసు వేస్తాం.. అర్బాజ్ ఖాన్
డైరెక్టర్ అభినవ్ కశ్యప్ పై కోర్టులో కేసు వేస్తామని నటుడు, దర్శక నిర్మాత అర్బాజ్ ఖాన్ ప్రకటించారు. తాను, తమ తండ్రి సలీం ఖాన్, సోదరులు సల్మాన్, సోహైల్ ఖాన్ మొత్తం తమ కుటుంబమంతా ఆయనపై లీగల్ చర్య తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ ఫ్యామిలీ తనను వేధించిందని..
డైరెక్టర్ అభినవ్ కశ్యప్ పై కోర్టులో కేసు వేస్తామని నటుడు, దర్శక నిర్మాత అర్బాజ్ ఖాన్ ప్రకటించారు. తాను, తమ తండ్రి సలీం ఖాన్, సోదరులు సల్మాన్, సోహైల్ ఖాన్ మొత్తం తమ కుటుంబమంతా ఆయనపై లీగల్ చర్య తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ ఫ్యామిలీ తనను వేధించిందని, తన భార్యపై అత్యాచారం చేస్తామని బెదిరించిందని, 2013 లో తన ‘బేషరమ్’ మూవీ విడుదలకు అడ్డుపడిందంటూ అభినవ్ కశ్యప్ సుదీర్ఘ పోస్టు పెట్టి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 2010 లో సల్మాన్, అర్బాజ్ ఇద్దరూ నటించిన ‘దబాంగ్’ చిత్రానికి అభినవ్ దర్శకత్వం వహించారు. అయితే దబాంగ్-2 ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకోవడంతో అర్బాజ్ ఖాన్ ఆ చిత్రానికి దర్శకత్వం వహించారు. అసలు అభినవ్ చేస్తున్న ఆరోపణలు ఎక్కడినుంచి వస్తున్నాయో తనకు తెలియదని అర్బాజ్ అన్నారు. గతంలో కూడా ఆయనపై లీగల్ చర్య తీసుకున్నానని ఆయన చెప్పారు.
దబాంగ్-2 ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి ఆయనతో తాము కాంటాక్ట్ లో లేమని, ప్రొఫెషనల్ గా తాము విడిపోయామని అర్బాజ్ ఖాన్ స్పష్టం చేశారు. అటు-సలీం ఖాన్ కూడా అభినవ్ కశ్యప్ ఆరోపణలపై స్పందిస్తూ.. ఆయన వ్యాఖ్యలను పట్టించుకోనని, ఆ ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. వాటికి స్పందించి తన సమయాన్ని వృధా చేసుకోనన్నారు. నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఘటనను తన ఫేస్ బుక్ లో ప్రస్తావించిన అభినవ్ కశ్యప్.. దీనిపై కూలంకషంగా దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వాన్ని కోరుతూనే.. సల్మాన్ కుటుంబం నుంచి తాను ఎదుర్కొన్న వేధింపులను గుర్తు చేశారు.