ఇలా చేస్తే వైరస్ ఉండదట.. వరంగల్ నిట్ అధ్యాపకుల ఘనత
వైరస్ వ్యాప్తి నిరోధానికి వరంగల్ నిట్ అధ్యాపకులు సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించారు. నిట్లో భౌతికశాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ దినకర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డీ హరినాథ్లు సంయుక్తంగా ఓజోనిట్ పేరుతో ఫ్రిజ్ వంటి స్టెరిలైజేషన్ యంత్రాన్ని రూపొందించారు. దీనికి వైరస్ ను మట్టుపెట్టేయవచ్చంటున్నారు.
కరోనా వైరస్ ధాటికి జనం బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. కనిపించని మహమ్మారి ఏ రూపంలో అంటుకుంటుందోనన్న ఆందోళన. కనీసం మార్కెట్కు నిత్యవసరాలు తెచ్చుకోవాలంటేనే జంకుతున్నారు. పండ్లు, పాలు, నిత్యావసరాలు, డెలివరీ ప్యాకింగ్లు ఇలా ఏ రూపంలో కరోనా వ్యాప్తి చెందుతుందోనన్న ఆందోళన.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తి నిరోధానికి వరంగల్ నిట్ అధ్యాపకులు సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించారు. నిట్లో భౌతికశాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ దినకర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డీ హరినాథ్లు సంయుక్తంగా ఓజోనిట్ పేరుతో ఫ్రిజ్ వంటి స్టెరిలైజేషన్ యంత్రాన్ని రూపొందించారు. దీనికి వైరస్ ను మట్టుపెట్టేయవచ్చంటున్నారు.
నిత్యావసరాలతో పాటు ఇతరత్రా సరుకులను ఫ్రిడ్జ్ వంటి ఈ పరికరంలో ఉంచితే వైరస్ అంతమవుతుందంటున్నారు నిట్ అధ్యాపకులు. అందులో సరుకులను ఉంచి ఓజోన్ వాయువును పంపిస్తారు. 20 నుంచి 25 నిమిషాల వరకు ఓజోన్ వాయువులో ఉంచడం వల్ల వస్తువులకు ఉన్న అన్ని రకాలైన వైరస్లు 99.99 శాతం తొలిగిపోతాయని ప్రొఫెసర్ అంటున్నారు. కరోనా వ్యాప్తివాహక వస్తువులైన కూరగాయలు, పండ్లు, పాలు, ఆభరణాలు, సెల్ఫోన్లు, వాచ్లు, దుస్తులు, డెలివరీ ప్యాకింగ్లు.. ఇలా అన్నింటినీ వైరస్ రహితంగా మార్చుకోవచ్చంటున్నారు. పండ్లు, ఇతర తినుబండారాలపై ఉండే ఫంగస్, బ్యాక్టీరియా, ఇతర రసాయనాలను కూడా లేకుండా శుభ్రంచేయడం దీని ప్రత్యేకత. ఓజోన్ పంపింగ్ విధానం వల్ల వస్తువులు శుభ్రమవుతాయని.. త్వరలోనే ఈ ఫ్రిడ్జ్ను పూర్తిస్థాయిలో తయారుచేసి మార్కెట్లోకి తీసుకొస్తామని ప్రొఫెసర్ దినకర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ హరినాథ్ తెలిపారు. కరోనా విజృంభణ కారణంగా జనం పడుతున్న పాట్లను చూసి ఈ ఓజోనిట్ ను రూపొందించామని వారు వెల్లడించారు.