చిన్నమ్మ శశికళ విడుదలకు ప్రయత్నాలు.. ఇప్పుడప్పుడే కాదన్న కర్ణాటక హోంమంత్రి..!

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ ముందస్తు విడుదల ప్రయత్నాలకు గండిపడినట్లు కనిపిస్తుంది.

చిన్నమ్మ శశికళ విడుదలకు ప్రయత్నాలు.. ఇప్పుడప్పుడే కాదన్న కర్ణాటక హోంమంత్రి..!
Follow us

|

Updated on: Nov 21, 2020 | 7:52 PM

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ ముందస్తు విడుదల ప్రయత్నాలకు గండిపడినట్లు కనిపిస్తుంది. కర్ణాటక జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ప్రకటించినట్లు శశికళ వచ్చే యేడాది జనవరి 27న విడుదలకానున్నారు. అక్రమార్జన కేసులో సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం శశికళ బెంగళూరు పరప్పణ అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఆమె వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల కావాల్సి వుంది. అయతే సత్ప్రవర్తన తదితర కారణాల వల్ల ఆమెను జనవరి 27న విడుదల చేస్తామని ఆర్టీఐ చట్టం ప్రకారం కర్ణాటక జైళ్లశాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు.

ఈ నేపథ్యంలో శశికళ నాలుగేళ్ల జైలు శిక్ష కాలంలో ఒక్కసారి మాత్రమే ఆమె భర్త మృతి చెందినప్పుడు పెరోలుపై విడుదలయ్యారని, ఆ తర్వాత పెరోల్‌ కోరలేదని, ప్రభుత్వ సెలవులు కూడా కలుపుకుంటే ఆమె 129 రోజులకు ముందుగా విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే, కోర్టు విధించిన రూ.10 కోట్ల రూపాయల జరిమానా చిన్నమ్మ తరపు న్యాయవాదులు చెల్లించారు. దీంతో ఏ క్షణంలోనైనా ఆమె విడుదలవుతారని న్యాయవాది రాజా సెంధూర్‌పాండ్యన్‌ చెబుతూ వచ్చారు. ఈ చెల్లింపునకు సంబంధించిన రశీదులు, విడుదలకు విజ్ఞప్తితో కూడిన పిటిషన్‌ను.. ఆమె తరపు న్యాయవాదులు బెంగళూరు పరప్పన అగ్రహార జైలు వర్గాలకు సమర్పించారు. దీంతో జైల్లో ఉన్న శశికళకు విడుదల తర్వాత ఆహ్వానం పలికేందుకు తమిళనాడులో భారీ ఏర్పాట్లు చేశారు.

ఇదివుంటే, శశికళ ముందస్తు విడుదల కోరుతూ గురువారం న్యాయవాది రాజా సెంధూర్‌పాండ్యన్‌ కర్ణాటక జైళ్ల శాఖ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కర్నాటక హోంశాఖ మంత్రి బసవరాజ్‌ బొమ్మై మీడియాతో మాట్లాడుతూ శశికళ ముందస్తు విడుదల అసాధ్యమని ప్రకటించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం శశికళ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో శశికళ త్వరలో విడుదలవుతారని ఆశలు పెట్టుకున్న అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగం నేతలు, కార్యకర్తలు, ఆమె బంధువులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక శశికళ వచ్చే యేడాది జనవరి 27న మాత్రమే విడుదలవుతారని తెలుస్తోంది.