గ్యాస్లీక్ ఘటనః రూ. 50 కోట్లు డిపాజిట్ చేసిన ఎల్జీపాలిమర్స్
విశాఖ గ్యాస్ లీక్ ఘటనకు సంబంధించి ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం ముందస్తు ఆర్థిక సాయం అందజేసింది.
లాక్డౌన్ నేపథ్యంలో జరిగిన విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన.. దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. జరిగిన దుర్ఘటనలో ఇప్పటికే 12 మంది మృతి చెందగా, 350 మందికి పైగా బాధితులు చికిత్స పొందుతున్నారు.. ఈ ప్యాక్టరీ పరిసరాలలో ఉన్న అయిదు గ్రామాల ప్రజలు ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులలో జీవిస్తున్నారు.. ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఇటువంటి విష లిక్విడ్ వినియోగించే 20 కర్మాగారాల్లో తనిఖీలు చేయవలసిందిగా ప్రభుత్వం పొల్యుషన్ కంట్రోల్ బోర్డుని ఆదేశించింది.. పలు బృందాలు ప్రస్తుతం విశాఖలోని పలు కర్మగారాలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే విశాఖ గ్యాస్ లీక్ ఘటనకు సంబంధించి ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం ముందస్తు ఆర్థిక సాయం అందజేసింది.
మే నెల7వ తేదీన జరిగిన విశాఖ గ్యాస్ లీకేజీ సంఘటనకు సంబంధించి ఎన్జీటీ ఆదేశాల మేరకు శుక్రవారం పాలిమర్స్ యాజమాన్యం స్పందించింది. ఆ పరిశ్రమ యాజమాన్య ప్రతినిధులు జిల్లా కలెక్టర్ వాడ్రేవుల వినయ్చంద్ను కలిసి రూ.50 కోట్ల చెక్కును కలెక్టర్ కార్యాలయంలో డిపాజిట్ చేశారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ వినయ్చంద్ మాట్లాడుతూ ఎన్జిటి ఆదేశాల మేరకు పాలిమర్స్ యాజమాన్యం రూ.50 కోట్లు డిపాజిట్ చేసిన విషయం వాస్తవమేనన్నారు. ఈ మొత్తాన్ని ప్రత్యేక ఖాతాలో జమచేశామన్నారు. తదుపరి ఎన్జిటి ఆదేశాల ప్రకారం వీటిని వినియోగించడం జరుగుతుందన్నారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ విషయమై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు తక్షణమే రూ.50 కోట్ల రూపాయలను మందస్తుగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది.