కోహ్లీ, రోహిత్ మధ్య భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది..!
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఛాన్సు దొరికినప్పుడల్లా చురకలు వేసే మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఇప్పుడు కోహ్లీ సారథ్యంపైనే విమర్శలు చేశారు..
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఛాన్సు దొరికినప్పుడల్లా చురకలు వేసే మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఇప్పుడు కోహ్లీ సారథ్యంపైనే విమర్శలు చేశారు.. మొన్న జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టేమో ప్లే ఆఫ్ నుంచే నిష్ర్కమించింది.. రోహిత్శర్మ కెప్టెన్సీలోని ముంబాయి ఇండియన్స్ టీమేమో ఏకంగా కప్పునే గెల్చుకుంది. ఇక అప్పటి నుంచి కోహ్లీ, రోహిత్లలో ఎవరు బెస్ట్ అన్న డిబేట్ బాగా నడుస్తోంది.. ఈ విషయంలో రోహిత్ శర్మనే ది బెస్ట్ అని అంటున్నారు గౌతం గంభీర్.. స్టార్స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ కార్యక్రమంలో ఆకాశ్ చోప్రా, పార్థివ్ పటేల్లతో మాట్లాడుతూ గంభీర్ ఈ మాటన్నారు.. కోహ్లీ మంచి కెప్టెనే అయి ఉండవచ్చుగాక, రోహిత్ మాత్రం అత్యుత్తమం అని అన్నారు.. ఇద్దరి మధ్య భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని పరోక్షంగా కోహ్లీ సారథ్యాన్ని దెప్పిపొడిచారు గంభీర్.. ఆస్ట్రేలియా టూర్కు నటరాజన్, వాషింగ్టన్ సుందర్, యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ వంటి ఆటగాళ్లను ఎంపిక చేయడం సరికాదన్నారు. ఐపీఎల్లో వారు కనబర్చిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి ఉంటే కెప్టెన్సీ విషయంలోనూ ఆ నియమాన్ని పాటించాలి కదా అని గంభీర్ ప్రశ్నించారు. ఐపీఎల్ ప్రదర్శనను టీమిండియా ఎంపికకు ప్రామాణికంగా తీసుకోవద్దన్నారు గంభీర్. పార్థివ్ పటేల్ కూడా ఇంచుమించుగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. టీ-20 ఫార్మాట్లో విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మే మ్యాచ్ పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకుంటాడని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒత్తిడికి గురికాడని అన్నాడు.. అతడి నిర్ణయాలు కూడా బాగుంటాయని కితాబిచ్చాడు. అయితే ఆకాశ్ చోప్రా మాత్రం ఉన్నపలంగా ఇప్పుడు జట్టును మార్చాల్సిన అవసరం లేదన్నాడు.. టీమిండియా కెప్టెన్గా విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు లిమిటెడ్ ఓవర్ల మ్యాచ్ల్లో మంచి ప్రదర్శన కనబర్చారని, ఇది ఆయన తప్పు కాదని ఆకాశ్ చోప్రా అన్నాడు.