వైరస్ కట్టడికి “వైనతేయ హోమం”..! సూర్య దేవాలయంలో పూజలు..
వ్యాక్సిన్ లేని వైరస్ నివారణకు సామాజిక దూరం ఒక్కటే మార్గంగా భావించిన ప్రభుత్వాలు లాక్డౌన్ పాటిస్తున్నాయి. ఈ క్రమంలోనే సర్వ జన సంక్షేమం కోసం కొన్ని ఆలయాల్లో ప్రత్యేక హోమాలు, యాగాలు నిర్వహిస్తున్నారు.
ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత్లోనూ కోవిడ్ వైరస్ ప్రతాపం చూపుతున్న తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు చేపట్టాయి. ఇంతవరకు సరైన వ్యాక్సిన్ లేని వైరస్ నివారణకు సామాజిక దూరం ఒక్కటే మార్గంగా భావించిన ప్రభుత్వాలు లాక్డౌన్ పాటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయాలు కూడా మూతపడ్డాయి. ఈ క్రమంలోనే సర్వ జన సంక్షేమం కోసం కొన్ని ఆలయాల్లో ప్రత్యేక హోమాలు, యాగాలు నిర్వహిస్తున్నారు.
విశ్వశాంతి, సర్వ జన సంక్షేమం కోసం శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం ప్రాంగణంలో గల అనివెట్టి మండపం నందు “వైనతేయ” హోమం నిర్వహించారు. కరోనా మహమ్మారి ప్రబలకుండా దేశం సుభిక్షంగా ఉండాలని.. వైరస్ తగ్గుముఖం పట్టి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ఈ ప్రత్యేక హోమాలను అరసవల్లి సూర్య క్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు వెల్లడించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత అయిన సూర్యనారాయణ స్వామి ఈ మహమ్మారిని ప్రబలకుండా చేయాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సామాజిక దూరాన్ని పాటిస్తూ ఈ ప్రత్యేక పూజలు చేస్తున్నామని సహాయ కమిషనర్ , కార్యనిర్వాహణాధికారి పేర్కొన్నారు. లాక్డౌన్ నిబంధనల దృష్ట్యా భక్తులు ఎవరినీ ఈ హోమ పూజలకు అనుమతించడం లేదని తెలిపారు.