కరోనాను ‘దిద్దుబాటుదారు’గా చూడాలి: వెంకయ్య నాయుడు
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా గురించి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ మానవ జీవితాన్ని రీసెట్ చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా గురించి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ మానవ జీవితాన్ని రీసెట్ చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వైరస్ వచ్చి పాజ్ బటన్ నొక్కినట్టుగా జీవితాన్ని ఆపేసిందని, అలాగే రీసెట్ బటన్ ద్వారా పునఃప్రారంభించాలని కూడా తెలిపిందని పేర్కొన్నారు. ఒక రకంగా చెప్పాలంటే రెండు జీవన విధానాల మధ్య ఇదొక సంధి కాలమని వెంకయ్య నాయుడు అభివర్ణించారు.
ఈ మేరకు ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేసిన ఉప రాష్ట్రపతి.. ”మానవుడి ఆధునిక జీవితం సాఫీగా దూసుకుపోతుంది అని భ్రమపడుతున్న వేళ… కరోనా వైరస్ అనుకోకుండా మన జీవితంలోకి వచ్చింది. దీంతో మన జీవితం ఒక్కసారిగా నిలిచిపోయింది. ఈ సమయంలో ఏం నేర్చుకున్నామన్న దానిపైనే భవిష్యత్ పునాదులు ఏర్పరచుకోవచ్చు. ఆంగ్లంలో ఓ సామెత ఉంటుంది. బి (బర్త్) నుంచి డి (డెత్) వరకు సాగేదే జీవితమని. మధ్యలో సి (చాయిస్లు) జీవితం తీరును నిర్ణయిస్తుంది. సవాళ్లను ఎదుర్కోని జీవితం నిజమైన జీవితమే కాదని ప్రముఖ తత్వవేత్త సోకట్రీస్ చెప్పారు. దీన్ని ఇప్పటివరకు సమీక్షించుకునే అవకాశం మనకు రాలేదు. ఇప్పుడు కరోనా రూపంలో వచ్చింది. ఇప్పటికైనా జీవితాన్ని బేరీజు వేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది” అని రాసుకొచ్చారు. ఇక కరోనాను ఓ వైపరీత్యంగా మాత్రమే చూడకూడదని.. భవిష్యత్లో ఛాలెంజ్ ఎదుర్కొనే మన జీవన శైలిని సంస్కరించే దిద్దుబాటుదారుగా చూడాలని వెంకయ్య నాయుడు అన్నారు.