తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం: తరిస్తోన్న భక్తజనం, రేపటితో ముగియనున్న ఏకాదశి ఉత్సవాలు
తిరుమల చరిత్రలో మరో మహాద్భుత ఘట్టం రేపటితో ముగియనుంది. శ్రీవారి సన్నిధిలో తొలిసారి నిర్వహించిన పదిరోజుల వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఆదివారంతో పూర్తికానున్నా..
తిరుమల చరిత్రలో మరో మహాద్భుత ఘట్టం రేపటితో ముగియనుంది. శ్రీవారి సన్నిధిలో తొలిసారి నిర్వహించిన పదిరోజుల వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఆదివారంతో పూర్తికానున్నాయి. ఏటా ముక్కోటి ఏకాదశికి రెండురోజులు మాత్రమే ఉండే వైకుంఠ ద్వార దర్శన భాగ్యాన్ని ఈసారి పదిరోజులపాటు అందించిన టీటీడీకి మనసారా కృతజ్ఞతలు చెబుతున్నారు భక్తులు. తిరుమల చరిత్రలో తొలిసారిగా ఓ పర్వదినం పదిరోజుల పండుగగా మారడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆమాటకొస్తే, తిరుమలలో ఎప్పుడూ నిత్యకల్యాణం పచ్చతోరణమే! వేంకటాచల క్షేత్రం రోజూ పండుగ వాతావరణంతో కళకళలాడుతూ ఉంటుంది. కానీ ఓ పర్వదినం పదిరోజుల ఉత్సవంగా మారిన సందర్భం మాత్రం ఇదే! ముక్కోటితో మొదలైన వైకుంఠ ద్వార దర్శనాలు.. జనవరి 3వ తేదీ ఏకాంత సేవతో ముగుస్తాయి. శ్రీరంగం వంటి ప్రముఖ వైష్ణవాలయాల్లో.. పది రోజులపాటు ఉత్తర ద్వారాన్ని తెరుస్తారు. కాగా, తిరుమల చరిత్రలో తొలిసారిగా ఈ కీలక నిర్ణయం తీసుకోవడానికి ముందు ఎంతో అధ్యయనం జరిగింది. టీటీడీ నియమించిన సబ్ కమిటీ, దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆగమ పండితులతో చర్చించింది. వారి ఆమోదం తర్వాతే తిరుమలలో ముక్కోటి పర్వదినం.. పదిరోజుల ఉత్సవంగా మారింది. భక్తులకు మహద్భాగ్యం కలిగింది.