మీ ప్రభుత్వ నిర్వాకం తెలిసిపోయింది, గెహ్లాట్ పై కేంద్ర మంత్రి మండిపాటు
పాకిస్తాన్ నుంచి వలస వచ్చి రాజస్థాన్ లో సెటిలయిన 11 మంది హిందూ కుటుంబ సభ్యుల మృతిపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్..సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
పాకిస్తాన్ నుంచి వలస వచ్చి రాజస్థాన్ లో సెటిలయిన 11 మంది హిందూ కుటుంబ సభ్యుల మృతిపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్..సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇది మీ ప్రభుత్వ పనితీరును ప్రతిబింబిస్తోందని అన్నారు. పాక్ నుంచి వలస వచ్చిన భిల్ తెగ కుటుంబ సభ్యుల్లో 11 మంది జోధ్ పూర్ జిల్లాలోని ఓ ఫామ్ హౌస్ లో విగతజీవులై కనిపించారు. వీరిలో ఇద్దరు పురుషులు, నలుగురు మహిళలు, అయిదుగురు పిల్లలు ఉన్నారు. ఈ ఘటన మీ రాష్ట్రంలో జరుగుతున్న ఘోరానికి అద్దం పడుతోందని, దీనిపై మీ ప్రభుత్వంవెంటనే విచారణ జరిపి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని గజేంద్ర సింగ్..అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కోరారు.
కాగా ఈ కుటుంబంలో ఒక వ్యక్తి మాత్రం బతికిబయటపడ్డాడు. తమ వాళ్ళు ఎందుకు చనిపోయారో తనకు తెలియదని, ఈ సంఘటన రాత్రి జరిగిందని ఆ వ్యక్తి చెప్పాడు. అటు.. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు..ఈ కుటుంబ సభ్యులు బహుశా విషం తాగి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్ఛునని అంటున్నారు.