హైదరాబాద్లో రౌడీషీటర్ల దారుణ హత్యలు..కత్తులతో వెంటాడి..
హైదరాబాద్ లంగర్ హౌస్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. నడి రోడ్డు మీద ఇద్దరు రౌడీ షీటర్లు దారుణ హత్యకు గురయ్యారు.
హైదరాబాద్ లంగర్ హౌస్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. నడి రోడ్డు మీద ఇద్దరు రౌడీ షీటర్లు దారుణ హత్యకు గురయ్యారు. ప్రత్యర్థులు కత్తులతో దాడికి తెగబడటంతో రౌడీ షీటర్లు స్పాట్ లోనే మృతి చెందారు. చనిపోయినవారిని ఫయాదుద్దీన్, ఛాందీ మహ్మద్ లుగా గుర్తించారు. వీరి మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడ్డవారిని అష్రఫ్ ముఠా సభ్యులుగా అనుమానిస్తున్నారు.
రోడ్డుపై ఉన్న ఛాందీ మహ్మద్, ఫయాదుద్దీన్ను మొదట కారుతో ఢీకొట్టారు. అనంతరం కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. మృతులు మహ్మద్, ఫయాదుద్దీన్ గోల్కొండ ప్రాంతవాసులని తెలుస్తోంది. రౌడీ షీటర్లను చంపిన అనంతరం దుండగులు ఘటనాస్థలంలోనే కారును వదిలేసి వెళ్లిపోయారు. హత్యల విషయాన్ని తెలుసుకున్న సీపీ అంజనీ కుమార్ వెంటనే వచ్చి ఘటనా స్థలిని పరిశీలించారు. నిందితులను అతి త్వరగా పట్టుకుంటామని పశ్చిమ మండల డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. మరింత సమాచారం కోసం ఘటన జరిగిన ప్రాంతం చుట్టుపక్కల సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు పోలీసులు.