Big Breaking టీటీడీ ఆస్తుల విక్రయంపై నిషేధం
తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. రాజకీయ రచ్చ చెలరేగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల విక్రయంపై నిషేధం విధించాలని నిర్ణయించింది.
Tirumala Tirupati Trust board has taken sensational decision: తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. రాజకీయ రచ్చ చెలరేగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల విక్రయంపై నిషేధం విధించాలని నిర్ణయించింది. గురువారం జరిగిన టీటీడీ ట్రస్టు బోర్డులో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో టీటీడీ ఆస్తులను విక్రయించకూడదని నిర్ణయం తీసుకున్నామని బోర్డు ఛైర్మెన్ వై వీ సుబ్బారెడ్డి స్వయంగా వెల్లడించారు.
‘‘ టిటిడి ఆస్తులను భవిష్యత్తులో అమ్మడం అనేది నిషేధించాము.. దీనిపైనే బోర్డ్ తీర్మానం చేసింది.. ఇటీవల భూముల వేలానికి సంబంధించి వివాదం వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నాము.. టిటిడి ఆస్తుల పరిరక్షణకు టిటిడి బోర్డ్ సభ్యులు, స్వామీజీలతో కమిటీ వేశాము.. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా.. సెంటిమెంట్ కు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇస్తాము.. ’’ అని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.
ఇటీవల భూముల అమ్మకాలపై చెలరేగిన వివాదం పై విచారణ జరిపిస్తామని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ‘‘ ఈ రాజకీయ దుమారం వెనుక కుట్ర జరిగిందనే అనుమానం ఉంది.. దీనిలో మా బోర్డ్ సభ్యులు ఉన్నారా..లేక టిటిడి ఉద్యోగులు ఉన్నారా అనే దానిపై విచారణ చేయాలని ప్రభుత్వాన్ని కోరాము.. ఒక కుట్ర ప్రకారం అందరూ కలిసి టిటిడి పై బురద జల్లారు.. టిటిడి గెస్ట్ హౌజులు అక్రమంగా కేటాయించారంటూ తప్పుడు ప్రచారం చేశారు.. డోనేషన్లు ఇచ్చిన వారికి నామినేషన్ వేయించి అర్హత ఉన్నవారికి మాత్రమే గెస్ట్ హౌజులు కేటాయిస్తున్నాము.. ఇందుకు విధివిధానాలు రూపొందిస్తున్నాము.. టిటిడి గెస్ట్ హౌజులు కేటాయింపులో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదు.. ’’ అని వైవీ సుబ్బారెడ్డి వివరించారు.
ఇదిలా వుంటే.. పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది గురువారం జరిగిన టీటీడీ బోర్డు సమావేశం. తిరుపతిలో రూ.20 కోట్లతో వంద పడకల చిన్న పిల్లల ఆసుపత్రి నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ విద్యా సంస్థల్లో టీటీడీ ఉద్యోగుల పిల్లలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానించిన టీటీడీ.. ఇంజీనిరింగ్ పనులకు తాత్కాలికంగా అనుమతి రద్దు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది ఆలయాలను దత్తత తీసుకోవాలని కూడా టీటీడీ నిర్ణయం తీసుకుంది.
కరోనా ప్రభావంతో అమల్లో వున్న లాక్ డౌన్ కారణంగా గురువారం టీటీడీ బోర్డు మీటింగ్ను వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో నిర్వహించారు. దాంతో హైదరాబాద్లో వున్న మై హోం అధినేత డా. జూపల్లి రామేశ్వర్ రావుతో పాటు దామోదర్ రావు, జివి భాస్కర్ రావు, ఎం.రాములు, ఎన్ సుబ్బారావు, శివకుమార్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా బోర్డు మీటింగ్కు హాజరయ్యారు. సామాజిక దూరం నిబంధనను పాటిస్తూ తమ అభిప్రాయాలను సమావేశంలో పంచుకున్నారు.