ఇలా జరగడం శ్రీవారి ఆలయ చరిత్రలో తొలిసారి: ప్రధానార్చకులు
శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించడం తిరుమల ఆలయ చరిత్రలోనే ఇది తొలిసారని ఆలయ ప్రధానార్చకులు
Tirumala Brahmostavam news: శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించడం తిరుమల ఆలయ చరిత్రలోనే ఇది తొలిసారని ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు అన్నారు. ప్రస్తుతం సంక్షోభ పరిస్థితుల్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఆపకుండా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రథోత్సవ స్థానంలో సర్వభూపాల వాహనాన్ని నిర్వహించడానికి ఆగమశాస్త్రం ప్రకారం ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. సర్వభూపాల వాహనం స్వామివారి రథాన్ని పోలి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు
బ్రహ్మోత్సవ సేవల్లో ఎక్కువమంది అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొనే ఆవశ్యకత ఉండటంతో ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో వాహనసేవలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వేణుగోపాల దీక్షితులు వివరించారు. అలాగే మాడవీధుల్లో నిర్వహించే దివ్య ప్రబంధం, మంగళవాయిద్యాలు, వేద పారాయణాన్ని ఆలయంలోనే ఏకాతంగా నిర్వహిస్తామని తెలిపారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 నుండి 8 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. అయితే ఉత్సవమూర్తి అలంకరణ, వైదిక కార్యక్రమాలను యథావిధిగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇక గరుడవాహనంరోజు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. చక్రస్నానాన్ని పుష్కరిణిలో చేసే పరిస్థితి లేకపోవడంతో ఆలయంలోనే గంగాళంలో ఆ కార్యక్రమం నిర్వహిస్తామని వేణుగోపాల దీక్షితులు అన్నారు. కాగా ఈ నెల 19 నుంచి 27 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే.
Read More:
నెల రోజుల పోరాటం.. కరోనాతో కన్నుమూసిన ఎయిమ్స్ మాజీ విద్యార్థి
విశాఖ హనీట్రాప్ గూఢచర్యం కేసు.. మరొకరికి అరెస్ట్ చేసిన ఎన్ఐఏ