చెత్త నుంచి ఎరువు..టీటీడీ సరికొత్త ప్రయోగం
తిరుమల కొండపై గుట్టలుగుట్టలుగా పేరుకుపోయిన చెత్తకు టీటీడీ సరికొత్త పరిష్కారాన్ని కనుకొంది. కొత్త టెక్నాలజీ ద్వారా చెత్తను ఎరువుగా మార్చాలని యోచిస్తోంది. టెంపుల్ సిటీకి కొత్త లుక్ ఇచ్చేందుకు టీటీడీ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
తిరుమల కొండపై గుట్టలుగుట్టలుగా పేరుకుపోయిన చెత్తకు టీటీడీ సరికొత్త పరిష్కారాన్ని కనుగొంది. కొత్త టెక్నాలజీ ద్వారా చెత్తను ఎరువుగా మార్చాలని యోచిస్తోంది. టెంపుల్ సిటీకి కొత్త లుక్ ఇచ్చేందుకు టీటీడీ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సాలీడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ను కొత్త టెక్నాలజీతో అభివృద్ధి చేయాలని టీటీడీ నిర్ణయించింది. బయో డీగ్రేడబుల్ తడి చెత్త నుంచి సేంద్రీయ ఎరువు తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి లైసెన్సు తీసుకోనుంది. దీంతో తిరుమలలో నిరుపయోగంగా పడి ఉన్న 7 వేల టన్నుల కంపోస్టుకు మోక్షం లభించనుంది.
తిరుమలలో ప్రతిరోజూ వచ్చే వ్యర్థాలను హెల్త్ డిపార్ట్మెంట్ సేకరించి డంపింగ్ యార్డుకు చేర్చుతుంది. అక్కడ తడి, పొడి చెత్తను వేరుచేసి బయోడిగ్రేడబుల్ తడి చెత్త ద్వారా సేంద్రీయ ఎరువు తయారు చేస్తారు. 13 ఏళ్ల క్రితం కంపోస్టు తయారీకి మహీంద్ర కంపెనీ యంత్రాలను విరాళంగా అందించింది. కొన్నేళ్ల పాటు వాటి నిర్వహణను కూడా చూసుకుంది. ఆ తర్వాత కంపెనీ తప్పుకోవడంతో టీటీడీ.. కంపోస్టు తయారీకి కొత్త టెండర్లను పిలిచింది. అప్పటి నుంచి కంపోస్టు తరలించడం తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో కంపోస్టు తయారీకి నాలుగేళ్లలో టీటీడీ 7 కోట్ల 20 లక్షల రూపాయలు ఖర్చు చేసింది.
ప్రస్తుతం డంపింగ్ యార్డు వద్ద 7వేల టన్నుల కంపోస్టు నిరుపయోగంగా పడి ఉంది. ఈ అంశంపైనే టీటీడీ బోర్డు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిరుపయోగంగా ఉండటం పట్ల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. టీటీడీనే ప్రత్యేకంగా లైసెన్సు తీసుకోవడం ద్వారా టెండర్ దారులను పిలిచి కంపోస్టును విక్రయించుకోవచ్చని సూచించారు. లేదంటే టీటీడీనే లాభపేక్ష లేకుండా రైతులకు అందించవచ్చని చెప్పారు. దీనిపై స్పందించిన టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి సమగ్ర నివేదిక రూపొందించి కంపోస్టు రవాణాకు అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు. ఎరువును రైతులకు ఉచితంగా అందించనున్నారు.
పర్యావరణ పరిరక్షణ కోసం సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ను కొత్త టెక్నాలజీతో అభివృద్ధి చేయాలని రెండు రోజుల క్రితం నిర్వహించిన సమావేశంలో టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. ఇందుకోసం బోర్డు మెంబర్ సుధా నారాయణ మూర్తి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. కంపోస్టు తయారీకి ఉపయోగిస్తున్న యంత్రాలు పాడైన కారణంగా వాటిని మార్చాలని నిర్ణయించారు. సాలీడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ కోసం ఇన్ఫోసిస్ టెక్నికల్ టీమ్ అభివృద్ధి చేసే కొత్త మెషినరీ, టెక్నాలజీని వాడుకోనున్నారు.
కంపోస్టు ట్రాన్స్ పోర్ట్ కు టీటీడీకి అనుమతి లభిస్తే రైతులకు మేలు కలగడమే కాకుండా ఎప్పటికప్పుడు చెత్తను తరలిస్తే దుర్వాసనను అరికట్టడమే కాకుండా తిరుమలకు ఈగల బెడద తప్పనుంది.