పాతనోట్లను మార్చాలని కేంద్రానికి టీటీడీ వినతి

టీటీడీ దగ్గర పేరుకుపోయిన కోట్లాది రూపాయల పాతనోట్లు మార్చాలని మరోసారి వైవి సుబ్బారెడ్డి కేంద్రాన్ని కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

పాతనోట్లను మార్చాలని కేంద్రానికి టీటీడీ వినతి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 16, 2020 | 7:10 PM

తిరుమల తిరుపతి దేవస్థానం వినతులపై కేంద్రం నుంచి స్పందన కరువైంది. పాతనోట్ల మార్పిడిపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. టీటీడీ దగ్గర పేరుకుపోయిన కోట్లాది రూపాయల పాతనోట్లు మార్చాలని మరోసారి వైవి సుబ్బారెడ్డి కేంద్రాన్ని కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

2016లో వెయ్యి, ఐదొందల నోట్లు రద్దు చేసినప్పటి నుంచి టీటీడీ నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించినా.. పాతనోట్ల ప్రవాహం ఆగలేదని తెలిపారు. ఆ తర్వాత కూడా స్వామి హుండీ ద్వారా పాతనోట్లు కానుకగా వచ్చాయన్నారు. భ‌క్తుల మ‌నోభావాల‌తో ముడిప‌డిన అంశం కావ‌డంతో ఈ నోట్లను హుండీలో స‌మ‌ర్పించ‌కుండా నిరోధించే ఏర్పాట్లు చేయలేకపోయాని కేంద్రమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

అనేక బ్యాంకుల్లో లావాదేవీలు జ‌రుపుతున్న టీటీడీ హుండీ ద్వారా ల‌భించే కానుక‌ల‌కు ప‌క్కాగా రికార్డులు నిర్వహిస్తోంద‌ని వివరించారు. పాత‌నోట్ల మార్పిడి అంశానికి సంబంధించి 2017 నుంచి టీటీడీ అనేక‌సార్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ‌, రిజ‌ర్వు బ్యాంకుకు లేఖ‌లు రాసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఈ అంశంపై సానుకూల నిర్ణయం తీసుకుని పాత నోట్లను రిజ‌ర్వు బ్యాంకులో గానీ లేదా ఏ ఇత‌ర బ్యాంకుల్లోనైనా డిపాజిట్ చేసేలా ఉత్తర్వులు ఇవ్వాల‌ని టీటీడీ చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి కోరారు.

నిజానికి నాలుగేళ్ల కిందటే పాతనోట్లు రద్దు అయిపోయాయి. కనీసం ఇప్పుడు చూద్దామన్నా కన్పించడం లేదు. ఆ నోట్లు ఇప్పుడు చిత్తు కాగితాలతో సమానం. కానీ తిరుమల శ్రీవారి దగ్గర అలాంటి నోట్లు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. 2016 నవంబర్‌ 8న దేశంలో ఐదొందలు, వెయ్యి నోట్లు చెల్లవని ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత భక్తులు చాలా వరకు ఆ నోట్లను స్వామివారి హుండీలో వేశారు. పాత నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చని చెప్పినా దానికి కొన్ని నిబంధనలు పెట్టారు. దీంతో కొందరు ఆ పాతనోట్లను స్వామివారి హుండీలో పడేశారు.

ఇలా కోట్లాది రూపాయల పాతనోట్లు టీటీడీ దగ్గర పేరుకుపోయాయి. ప్రధాని ప్రకటన తర్వాత తిరుమల కొండపై టికెట్ల బుకింగ్‌ మొదలుకొని ప్రసాదాల అమ్మకాల వరకు పాతనోట్లను తీసుకోవడం మానేశారు. అయినా ఆ నోట్లన్నీ హుండీలోకి చేరిపోయాయి. ఇలా టీటీడీకి భక్తుల నుంచి వచ్చిన 18కోట్ల రూపాయల విలువైన వెయ్యినోట్లు, 30 కోట్ల 17లక్షల రూపాయల 500నోట్లు కానుకగా వచ్చాయి.

ఇక తిరుమల ఆలయ భద్రత కోసం నియమించుకున్న ఎస్‌పీఎఫ్‌ విభాగానికి బకాయి ఉన్న జీఎస్టీని రద్దు చేయాలని వైవీ సుబ్బారెడ్డి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ఈ బకాయిలు మొత్తం 23 కోట్ల 78 లక్షలు ఉన్నాయి. ఈ జీఎస్టీని రద్దు చేస్తే ఆ డబ్బులతో మరిన్ని సామాజిక, విద్య, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. తిరుమలలో సెక్యూరిటీ కోసం నియమించుకున్న స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ విభాగానికి 2014, ఏప్రిల్ 1 నుంచి 2020 జూన్ 30 వరకు జీఎస్టీ రూపంలో 23 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. మరి ఈసారైనా పాతనోట్లు, జీఎస్టీ వినతులపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందో లేదో చూడాలి.