గవర్నర్ కు టీఎస్ పీఎస్సీ వార్షిక నివేదిక
ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీఎస్పీఎస్సీ 2018-19 వార్షిక నివేదికను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు అందజేసింది. గవర్నర్తో బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి నివేదికను సమర్పించారు.
ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీఎస్పీఎస్సీ 2018-19 వార్షిక నివేదికను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు అందజేసింది. గవర్నర్తో బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి నివేదికను సమర్పించారు. 2015 జూలై నుంచి ఈ ఏడాది సెప్టెంబరు వరకు కేవలం టీఎస్పీఎస్సీ ద్వారా 39,952 ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపినట్టు నివేదికలో పేర్కొన్నారు.
టిఎస్పీఎస్సీ ద్వారా ఇప్పటి వరకు 36,665 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేసినట్లు తెలిపారు. వాటిలో 29,128 ఉద్యోగాలను భర్తీ చేయగా, 1621 పోస్టుల భర్తీ చివరి దశల్లో ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. మార్కుల వెయిటేజీ, కోర్టు కేసులు తదితర కారణాల వల్ల 5,916 పోస్టుల భర్తీ ప్రక్రియ నిలిచిపోయినట్లు తెలిపారు. ఇందులో 290 పారామెడికల్ పోస్టుల భర్తీకి సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి 30శాతం వెయిటేజీ మార్కుల జాబితా అందలేదని పేర్కొన్నారు. కోర్టు కేసుల వల్ల 4,207 పారామెడికల్ పోస్టులు, 1,419 టీఆర్టీ, గురుకుల పీఈటీ పోస్టుల భర్తీ నిలిచిపోయినట్లు తెలిపారు.
2018-19లో 18 నోటిఫికేషన్ల ద్వారా 3,276 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నామని అన్నారు. అయితే ఇందులో 45 పరీక్షలను నిర్వహించామని వెల్లడించారు. ఈ పరీక్షలకు 19,91,770 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 12,97,566 మంది హాజరైనట్లు తెలిపారు. వీరిలో 15,994 మంది ఎంపికైనట్లు నివేదికలో పేర్కొన్నారు. గతేడాది 107 కేసులకుగానూ 100 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు.
టీఎస్పీఎస్సీ పనితనాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశంసించారు. టీఎస్పీఎస్సీలో నూతన సంస్కరణల అమలు, విజయవంతంగా పలు పోస్టులు భర్తీ చేయడంపై చైర్మన్ను, సభ్యులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో టీఎస్ పీఎస్సీ సభ్యులు సీ విఠల్, బీ చంద్రావతి, మహ్మద్ మథీనుద్దీన్ ఖాద్రీ, డీ కృష్ణారెడ్డి, సీహెచ్ సాయిలు, ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీప్రసాద్ పాల్గొన్నారు.