గుడ్న్యూస్ః సర్కార్ ఆస్పత్రుల్లో వైద్యుల నియామకాలు !
తెలంగాణలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. మొన్నటి వరకు గ్రేటర్ హైదరాబాద్ను గడగడలాడించిన వైరస్ ఇప్పుడు జిల్లాలను వణికిస్తోంది...
తెలంగాణలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. మొన్నటి వరకు గ్రేటర్ హైదరాబాద్ను గడగడలాడించిన వైరస్ ఇప్పుడు జిల్లాలను వణికిస్తోంది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాల్లో వైద్య సిబ్బంది కొరత లేకుండా, అత్యవసర నియామకాలను చేపట్టేందుకు కార్యాచరణ అమలు చేస్తోంది.
కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు కాంట్రాక్టు పద్ధతిన కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, దవాఖానాల్లో పని చేసేందుకు 20 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లను నియమించనున్నట్లు కరీంనగర్ కలెక్టర్ శశాంక తెలిపారు. ప్రతి నెలా రూ.40,270 జీతంతో పాటు తగు ప్రోత్సాహకాలు ఉంటాయని చెప్పారు. ఆసక్తి ఉన్న ఎంబీబీఎస్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 31న కరీంనగర్లోని కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉదయం 11నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే వాక్ఇన్ ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు.
అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతోపాటు ఎస్సెస్సీ, ఎంబీబీఎస్, కులం, ఇటీవల తీసుకున్న రెండు కలర్ పాస్పోర్టు సైజ్ ఫొటోలు, టీఎస్ మెడికల్ కౌన్సిల్ రిజిస్టేష్రన్తో హాజరుకావాలని సూచించారు. ఈ నెల 27న హైదరాబాద్లో నిర్వహించిన వాక్ఇన్ ఇంటర్వ్యూకు హాజరైన డాక్టర్లు తిరిగి కరీంనగర్లో నిర్వహించే వాక్ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.