సీఎం కేసీఆర్ స్పెషల్ గిఫ్ట్..వారి ఖాతాల్లోకి రూ.5వేలు
మహమ్మారి కోవిడ్-19 పంజా నుంచి తప్పించుకోవటానికి ప్రజలు గడపదాటకుండా జాగ్రత్తచర్యలు తీసుకుంటున్నారు. కానీ, వాళ్లు మాత్రం నిరంతరం శ్రమిస్తున్నారు...
కరోనా దెబ్బకు యావత్ భారతావని బంధిగా మారింది. కేంద్రం ప్రకటించిన లాక్డౌన్ తో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. రోడ్లు, వీధులు నిర్మానుష్యంగా మారాయి. మహమ్మారి కోవిడ్-19 పంజా నుంచి తప్పించుకోవటానికి ప్రజలు గడపదాటకుండా జాగ్రత్తచర్యలు తీసుకుంటున్నారు. కానీ, వాళ్లు మాత్రం నిరంతరం శ్రమిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. అటువంటి కష్టజీవులకు సీఎం కేసీఆర్ స్పెషల్ గిఫ్ట్ ప్రకటించారు.
లాక్డౌన్ కాలంలో రోడ్లను ఊడుస్తూ వీధులు, గల్లీలను శుభ్రం చేస్తూ..ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చూస్తున్న శానిటైజర్ సిబ్బందికి సీఎం బహుమతి అందజేయనున్నారు. వారి కష్టాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ వారికి ప్రోత్సాహకం అందిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. వారికి చేతులెత్తి దండం పెట్టిన సీఎం.. జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్డబ్ల్యూలో పనిచేస్తున్న వారికి రూ.7500, గ్రామపంచాయతీలు, మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న వారికి రూ.5వేలు ఇస్తానని చెప్పారు. అన్నట్లుగానే సీఎం స్పెషల్ ఇన్సెంటివ్ నిధులు విడుదలయ్యాయి. ప్రతి కార్మికుడి ఖాతాల్లోకి నేటి నుంచి రూ.5వేలు జమకానున్నాయి. దాని కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.21.84 కోట్లు విడుదల చేసింది.
గ్రామ పంచాయతీల్లో సఫాయి కర్మచారులు 43,661 మంది, మునిసిపాలిటీల్లో 21,531మంది, హైదరాబాద్ వాటర్వర్క్స్ అండ్ సేవరేజ్ బోర్డులో 2510, జీహెచ్ఎంసీలో 20690 మంది.. మొత్తం 95,392 మంది పనిచేస్తున్నారు. వారందరికీ సీఎం గిఫ్ట్ అందనుంది. వారి జీతాల్లోనూ కోత పెట్టకుండా చర్యలు తీసుకున్నారు సీఎం.దీంతో కార్మికులు తమ కష్టాన్ని గుర్తించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.