పార్టీ రాజ్యసభ ఎంపీలకు కేసీఆర్ ఆదేశం
మోదీ సర్కారు తెచ్చిన నూతన వ్యవసాయ బిల్లు తేనేపూసిన కత్తి వంటిదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. మొదటినుంచీ ఈ బిల్లుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కేసీఆర్..
మోదీ సర్కారు తెచ్చిన నూతన వ్యవసాయ బిల్లు తేనేపూసిన కత్తి వంటిదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. మొదటినుంచీ ఈ బిల్లుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కేసీఆర్.. రాజ్యసభలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని టీఆర్ఎస్ ఎంపీలను ఆదేశించారు. దీన్ని కచ్చితంగా అడ్డుకుని తీరాలని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈ వ్యవసాయ బిల్లు రైతు లోకానికి తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. రైతులను దెబ్బ తీసి కార్పోరేటు వ్యాపారులకు లాభం చేకూర్చే విధంగా ఈ బిల్లు ఉందని సీఎం పేర్కొన్నారు. రైతులు తమ సరుకును ఎక్కడైనా అమ్ముకోవచ్చని బిల్లులో చెప్పారు.. కానీ వాస్తవానికి ఇది వ్యాపారులు ఎక్కడికైనా వెళ్లి సరకును కొనుగోలు చేయడానికి ఉపయోగపడే విధానం అని కేసీఆర్ చెప్పుకొచ్చారు. కార్పోరేట్ గద్దలు దేశమంతా విస్తరించడానికి, ప్రైవేటు వ్యాపారులకు ద్వారాలు బార్లా తెరవడానికి ఉపయోగపడే బిల్లుగా ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రైతులు తమకున్న కొద్దిపాటు సరుకును ఎన్నో రవాణా ఖర్చులు భరించి లారీల ద్వారా వేరే చోటుకు తీసుకెళ్లి అమ్మడం సాధ్యమేనా? అని కేసీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు.