చైనాలో మైనారిటీలపై వేధింపులు.. డ్రాగన్ కంట్రీని ‘శిక్షించిన’ ట్రంప్
చైనాలో యూఘుర్ తెగ జాతి ముస్లిం మైనారిటీల పట్ల ఆ దేశం పాల్పడుతున్న అణచివేత విధానాలకు మండిపడిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. డ్రాగన్ కంట్రీని 'శిక్షించడానికి' పూనుకొన్నారు. ఇందుకు ఉద్దేశించిన ఓ బిల్లు (చట్టం) పైఆయన సంతకం చేశారు. 'యూఘుర్' హ్యూమన్ రైట్స్ పాలసీ..
చైనాలో యూఘుర్ తెగ జాతి ముస్లిం మైనారిటీల పట్ల ఆ దేశం పాల్పడుతున్న అణచివేత విధానాలకు మండిపడిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. డ్రాగన్ కంట్రీని ‘శిక్షించడానికి’ పూనుకొన్నారు. ఇందుకు ఉద్దేశించిన ఓ బిల్లు (చట్టం) పైఆయన సంతకం చేశారు. ‘యూఘుర్’ హ్యూమన్ రైట్స్ పాలసీ (2020)’ అనే ఈ చట్టాన్నిట్రంప్ ప్రభుత్వం తెచ్చిందని,, మానవ హక్కుల ఉల్లంఘనకు ఎవరు పాల్పడినా శిక్షిస్తామని ట్రంప్ హెచ్చరించినట్టు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. ఇలా మైనారిటీల పట్ల అమానుషంగా వ్యవహరించే చైనా అధికారులపై ఆంక్షలు విధిస్తామని ఆయన పేర్కొన్నట్టు ఈ వర్గాలు తెలిపాయి. చైనాలో ముస్లిం మైనారిటీలపై నిఘా పెడుతున్నారని, వారిని, వారి మత విశ్వాసాలను దెబ్బ తీస్తున్నారని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. అమెరికాలో నివసిస్తున్న మైనారిటీల పట్ల కూడా చైనా అధికారులు ఇలాగే వ్యవహరిస్తున్నారని సైతం దుయ్యబట్టింది. కాగా-అమెరికా మాజీ జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు జాన్ బోల్టన్ తన పుస్తకంలో రచించిన అంశాలకు, ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు పూర్తి తేడా ఉందని భావిస్తున్నారు. జాన్ తన బుక్ లో ట్రంప్.. చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్ళీ ఈ పదవికి ఎన్నికయ్యేలా సాయం చేయాలనీ చైనా అధినేత జీ జిన్ పింగ్ ని కోరారని పేర్కొన్న సంగతి తెలిసిందే.