Viral: డెలివరీ బాయ్ తత్తరపాటు.. ఎదురుగా పోలీసుల తనిఖీలు.. అనుమానమొచ్చి అతడి బ్యాగ్ చెక్ చేయగా!
పోలీసులు సాధారణ తనిఖీలు చేపడుతుండగా.. అటుగా వచ్చిన ఇద్దరు డెలివరీ బాయ్స్ కదలికలపై..
డ్రగ్స్ దందా యదేచ్చగా సాగుతోంది. పోలీసులు అన్ని విధాలుగా చర్యలు చేపడుతున్నప్పటికీ.. కేటుగాళ్లు తమ క్రియేటివిటీకి పదునుపెట్టి.. వారి ఎత్తుకు పైఎత్తులు వేస్తూ డ్రగ్స్ అక్రమ రవాణాను కొనసాగిస్తున్నారు. తాజాగా డ్రగ్స్ అక్రమంగా తరలిస్తున్న ఐదుగురు పెడ్లర్స్ను బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. పోలీసులు సాధారణ తనిఖీలు చేపడుతుండగా.. అటుగా వచ్చిన ఇద్దరు డెలివరీ బాయ్స్ కదలికలపై వారికి అనుమానమొచ్చింది. వాళ్లను పక్కకు తీసుకొచ్చి బ్యాగ్స్ చెక్ చేయగా.. పెద్ద మొత్తంలో కొకెయిన్, చరస్, హషీష్, ఎల్ఎస్డీ స్ట్రిప్స్, గంజాయి లభ్యమైంది. ఆ తర్వాత పోలిసులు ఈ దందా తీగ లాగితే మొత్తం డొంక అంతా కదిలింది. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా.. వారంతా 20-25 ఏళ్ల మధ్య వయస్సువారు కావడం గమనార్హం. వారి దగ్గర నుంచి రూ. 2 కోట్లు విలువ చేసే కొకెయిన్, గంజాయి, డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ గ్యాంగ్ మొత్తం డార్క్నెట్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేశారు. ఆ తర్వాత డెలివరీ యాప్స్ ద్వారా కస్టమర్స్కు సర్వీస్లు అందిస్తూ వచ్చారు. డ్రగ్స్ను ఒక చోట నుంచి మరో ప్రాంతానికి డెలివరీ చేసేందుకు స్వంత డెలివరీ ఎగ్జిక్యూటివ్లను నియమించుకోవడమే కాకుండా.. డెలివరీ బాయ్స్ ఉద్యోగాలు కోసం ప్రకటనలను కూడా సోషల్ మీడియాలో వేదికగా పోస్ట్ చేసేవారు. ఇక జాబ్ చేసేందుకు వచ్చే అమాయకులను.. కొరియర్ కంపెనీ నడుపుతున్నామంటూ నమ్మించి పనిలో పెట్టుకునేవారు. కాగా, ఈ నిందితులు ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు నగరాల్లో తమ దందాను నడుపుతున్నారు. ఆయా నగరాల్లో వారి కింద పలువురు డెలివరీ ఏజెంట్స్ పని చేస్తున్నారు. ప్రస్తుతం వీరి బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేశామని.. ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు చేస్తున్నామని బెంగళూరు పోలీస్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి వెల్లడించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..