కరోనా చికిత్స పొందుతూ.. చెన్నైలో ఏపీ డాక్టర్ మృతి..!
కరోనా రక్కసి కోరల్లో ఏపి కొట్టుమిట్టాడుతోంది. రోజురోజుకూ విస్తరిస్తోన్న కోవిడ్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తాజాగా నెల్లూరు జిల్లాలో ఓ డాక్టర్ కరోనా బారిన పడి మరణించినట్లుగా తెలుస్తోంది...
కరోనా రక్కసి కోరల్లో ఏపి కొట్టుమిట్టాడుతోంది. రోజురోజుకూ విస్తరిస్తోన్న కోవిడ్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కలిపి కరోనా వైరస్ కేసు సంఖ్య 432కు చేరింది. అత్యధికంగా గుంటూరులో 90 మందికి కరోనా సోకింది. తరువాతి స్థానంలో 64 కరోనా కేసులతో కర్నూలు నిలిచింది. ఇంకా మరో మూడు జిల్లాలోనూ కరోనా ప్రతాపం చూపెడుతోంది. దీంతో ఆయా జిల్లాల్లో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇదిలా ఉండగా, నెల్లూరు జిల్లాలో ఓ డాక్టర్ కరోనా బారిన పడి మరణించినట్లుగా తెలుస్తోంది.
కాగా కరోనా వైరస్ చికిత్స పొందుతూ ఏపీకి చెందిన ఓ డాక్టర్ చెన్నైలో మృతి చెందారు. నెల్లూరుకు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్స్ డాక్టర్ కు కరోనా పాజిటివ్ రావడంతో.. వారం నుంచి చెన్నైలో చికిత్స పొందుతూ.. ఇవాళ మరణించారు. ఈ విషయాన్ని తమిళనాడు ఆరోగ్యశాఖ కార్యదర్శి బీలా రాజేష్ ప్రకటించారు. ఆ డాక్టర్ కుటుంబసభ్యులు క్వారంటాయిన్ లో ఉన్నారు. ఇక ఆయన అంత్యక్రియలను చెన్నైలోని అంబత్తూరు ప్రాంతంలో కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే తమ ప్రాంతంలో అంత్యక్రియలు జరపొద్దంటూ అక్కడి స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇక, రాష్ట్రవ్యాప్తంగా కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో భారీగా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.. వైరస్ కట్టడికి పటిష్టమైన చర్యలు చేపట్టింది. మూడోసారి హెల్త్ సర్వే నిర్వహిస్తున్న అధికారులు.. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు.. జిల్లాల వారీగా రెడ్, ఆరేంజ్, గ్రీన్ జోన్లుగా కొన్ని ఏరియాలను ప్రకటించారు. మరోవైపు కేసులు పెరుగుతుండడంతో ప్రతి ఒక్క పౌరుడికి మూడు మాస్కులు చొప్పున ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది.