ఆ మూడు తీర్పులు నేడే.. సుప్రీం చరిత్రలో సూపర్ డే
భారత సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ బిజీబిజీగా ఉండనుంది. గత కొద్ది రోజులుగా ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న తీర్పులను ఇస్తూ ప్రత్యేకతను చాటుకుంటుంది. తాజాగా దశాబ్ధాలుగా పెండింగ్లో ఉన్న అయోధ్య అంశానికి సంబంధించిన తీర్పును వెలువడించిన విషయం తెలిసిందే. ఇక ఇలాంటి చారిత్మక తీర్పులను వెలువరించేందుకు సుప్రీంకోర్టు మరోసారి రెడీ అయ్యింది. ఇవాళ ఒకే రోజు మూడు ప్రధాన కేసులకు సంబంధించిన తీర్పులను వెలువరించనున్నట్లు సుప్రీంకోర్టు రిజిష్ట్రార్ కార్యాలయం షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల17వ తేదీన సుప్రీంకోర్టు […]
భారత సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ బిజీబిజీగా ఉండనుంది. గత కొద్ది రోజులుగా ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న తీర్పులను ఇస్తూ ప్రత్యేకతను చాటుకుంటుంది. తాజాగా దశాబ్ధాలుగా పెండింగ్లో ఉన్న అయోధ్య అంశానికి సంబంధించిన తీర్పును వెలువడించిన విషయం తెలిసిందే. ఇక ఇలాంటి చారిత్మక తీర్పులను వెలువరించేందుకు సుప్రీంకోర్టు మరోసారి రెడీ అయ్యింది. ఇవాళ ఒకే రోజు మూడు ప్రధాన కేసులకు సంబంధించిన తీర్పులను వెలువరించనున్నట్లు సుప్రీంకోర్టు రిజిష్ట్రార్ కార్యాలయం షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల17వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజయ్ గొగోయ్ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో పలు ప్రధాన కేసుల పరిష్కారానికి ఆయన నడుం బిగించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఇవాళ ప్రధాన కేసుల తీర్పులు వెలువడనున్నాయి. అందులో ముఖ్యంగా..
1. శబరిమల అంశం…
కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్పస్వామి దేవాలయం. ఈ ఆలయంలోకి యుక్త వయసు మహిళల ప్రవేశంపై ఏళ్ల తరబడి నుంచి నిషేధం కొనసాగుతోంది. అయితే సుప్రీంకోర్టు గతేడాది నిషేధాన్ని ఎత్తివేస్తూ తీర్పునిచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాలు తీవ్ర నిరసనలు చేపట్టారు. ఆలయ సంప్రదాయాలపై కోర్టుల జోక్యం ఏంటంటూ మండిపడ్డారు. అయితే అదేసమయంలో పలు హిందూ సంఘాలు, ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపి ఫిబ్రవరి 6న తీర్పును రిజర్వ్లో పెట్టింది. తాజాగా ఇవాళ తీర్పు వెలువరించనుంది. అయితే గతేడాది సుప్రీం తీర్పు ఇచ్చిన క్రమంలో కేరళ ప్రభుత్వం.. మహిళలు ఆలయాన్ని దర్శించుకునేందుకు భద్రతను కల్పించింది. పూర్తి భద్రత మధ్య కొందరు మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించారు కూడా. అయితే తాజాగా ఇవాళ వెలువడుతున్న తీర్పు నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే.. ఈ నెల 16వ తేదీన సాయంత్రం ఆలయం తెరుచుకోనుంది. 17వ తేదీ నుంచి భక్తులకు అయ్యప్పస్వామి దర్శనం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ వెలువడే తీర్పు అత్యంత కీలకం కాబోతోంది. తీర్పు వెలువడనున్న నేపథ్యంలో శబరిమలతోపాటు కేరళ వ్యాప్తంగా భారీగా భద్రతా బలగాలను మోహరించారు.
2. రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలు వ్యవహారం కేసు..
ఇక మరో ప్రధాన కేసు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన కేసు.. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు ముందు రాఫెల్ యుద్ధ విమానాల అంశం రాజకీయ వివాదానికి తెరలేపింది. అయితే ఈ వివాదంపై సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఎన్డీయే ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చేసింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్ను చీఫ్ జస్టిస్ సారథ్యంలోని స్పెషల్ బెంచ్ విచారించింది. దీనిపై ఇవాళ స్పెషల్ బెంచ్ తీర్పు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీంతో అటు కాంగ్రెస్ శ్రేణుల్లో.. ఇటు బీజేపీ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది.
3. రాహుల్ గాంధీ కోర్ట్ ధిక్కరణ కేసు…
ఇక మూడో కేసు.. రాహుల్ గాంధీ వ్యక్తి గతానికి సంబంధించింది. రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలు వ్యవహారంలో ప్రధాని మోదీని దొంగగా అభివర్ణిస్తూ.. “చౌకీదార్ చోర్ హై” అంటూ రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే రాఫెల్ తీర్పును ఇస్తున్న క్రమంలో సుప్రీంకోర్టు ఆ వ్యాఖ్యం అనొద్దంటూ స్పష్టం చేసింది. అయినా కూడా రాహుల్ మాత్రం వినలేదు. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా చేపట్టిన ప్రచారంలో అనేక మార్లు “చౌకీదార్ చోర్ హై” అంటూ మోదీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. దీంతో రాహుల్ తీరుపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే ఆ తర్వాత “చౌకీదార్ చోర్ హై” నినాదాన్ని రాఫెల్ తీర్పునకు వర్తింపచేసినందుకుగాను రాహుల్ ఇప్పటికే సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పారు. అయితే కోర్టు తీర్పునకు ఆ నినాదాన్ని రాహుల్ తప్పుగా అన్వయించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి కోర్టుధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ రంజన్గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించనుంది.
మొత్తానికి ఇవాళ వెలువడే తీర్పులు.. సుప్రీంకోర్టు చరిత్రలో చారిత్రాత్మకం కాబోతున్నాయి. చీఫ్ జస్టిస్ రంజన్గొగొయి పదవీ విరమణకు ఇక మిగిలింది మూడు రోజులు మాత్రమే. ఇవాళ ఈ మూడు తీర్పులు వెలువడితే.. ఇక మిగిలింది.. ఒకే ఒక్క ప్రధానమైన కేసు.. ఫైనాన్స్ బిల్లుకు సంబంధించిన వివాదం. దీనిపై కూడా శుక్ర, శనివారాల్లో తీర్పు వెలువడే ఛాన్స్ ఉంది.