శ్రీవారికి అంగరంగ వైభోగంగా చక్రస్నానం
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయంలోని అయిన మహల్ ఎదురుగా ఏర్పాటు చేసిన తాత్కాలిక లఘు పుష్కరిణిలో ఆలయ అర్చకులు సుదర్శన చక్రాన్ని ముంచి శ్రీవారికి పవిత్ర స్నానం చేయించారు. ఉదయం 6.00 గంటల నుండి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. స్నపన తిరుమంజనం సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, […]
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయంలోని అయిన మహల్ ఎదురుగా ఏర్పాటు చేసిన తాత్కాలిక లఘు పుష్కరిణిలో ఆలయ అర్చకులు సుదర్శన చక్రాన్ని ముంచి శ్రీవారికి పవిత్ర స్నానం చేయించారు. ఉదయం 6.00 గంటల నుండి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. స్నపన తిరుమంజనం సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రములు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే వేదాలను టిటిడి వేదపారాయణదారులు పారాయణం చేశారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. తొమ్మిదిరోజుల ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలూ సఫలమై లోకం క్షేమంగా ఉండడానికీ, భక్తులు సుఖశాంతులతో ఉండడానికీ చక్రస్నానం నిర్వహించారు. ఉత్సవాలు ఒక యజ్ఞమే కనుక యజ్ఞాంతంలో అవభృథస్నానం చేస్తారు. యజ్ఞనిర్వహణంలో జరిగిన చిన్నచిన్న లోపాలవల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి, ఉత్సవాలు చేసినవారికి, చేయించినవారికి, ఇందుకు సహకరించినవారికీ, దర్శించిన వారికీ – అందరికీ ఈ ఉత్సవ యజ్ఞఫలం లభిస్తుంది. రాత్రి 7.00 నుండి 8.00 గంటల మధ్య బంగారు తిరుచ్చి ఉత్సవంతో శ్రీ వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి.