బెజ్జూర్-కమ్మర్గాం రహదారిపై పెద్దపులి కలకలం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. జిల్లాలోని అటవీ ప్రాంతం బెజ్జూర్-కమ్మర్గాం రహదారిపై పెద్దపులి సంచరిస్తుండడంతో అటవీ గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. జిల్లాలోని అటవీ ప్రాంతం బెజ్జూర్-కమ్మర్గాం రహదారిపై పెద్దపులి సంచరిస్తుండడంతో అటవీ గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనదారులు, స్థానిక ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఎప్పుడు ఎట్నుంచి పెద్దపులి ఎటాక్ చేస్తుందోనని భయం భయంగా వెళ్తున్నారు.
ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం బెజ్జూర్ కమ్మర్గాంకు మోటర్సైకిల్పై వెళ్తున్న ఇద్దరు యువకులు పెద్దపులిని చూసి భయంతో కిందపడి పోయారు. గుండెపల్లి గ్రామానికి చెందిన వారిద్దరూ చూస్తుండగానే వారికి అతి సమీపం నుంచే పెద్దపులి రోడ్డు దాడి వెళ్లిపోయిందంటూ వారు అధికారులకు వెల్లడించారు. బైక్పై నుండి పడడంతో ఇరువురికి గాయాలయ్యాయి. బెజ్జూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్సను అందించారు.
విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ పెంచికల్ పేట్ మండల వ్యాప్తంగా పెద్దపులులు సంచరిస్తున్నాయని, .. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. బెజ్జూర్, కమ్మర్గాం అటవీ ప్రాంతాల్లోని రహదారిలో పెద్దపులి అడుగులను గుర్తించామని తెలిపారు.. కావున ప్రజలందరు ఇతర ప్రాంతాలకు వెళ్లే టప్పుడు రోడ్డుపై గమనిస్తు జాగ్రత్తగా వెళ్లాలని కమ్మర్గాం, నందిగామ, మురలిగూడ గ్రామాల ప్రజలు అటు బెజ్జూర్ వెళ్లేటప్పడు గానీ, ఇటు పెంచికల్ పేట్ మండలానికి వెళ్లే సమయంలో ప్రయాణంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలకు తెలియజేశారు.